Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పవనాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 897.28, నిఫ్టీ 258.60 పాయింట్లు క్షీణించాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెనెక్స్ 58,237.85 పాయింట్లు, నిఫ్టీ 17,154.30 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిన విషయం తెలిసిందే. మరో వైపు సిగ్నేచర్ బ్యాంకును సైతం మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ప్రకటించాయి.
ఈ క్రమంలో ఈ ప్రభావం భారత మార్కెట్లపై ప్రభావం చూపిందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం సెన్సెక్స్ 59,033.77 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,094.55 దగ్గర కనిష్ఠాన్ని తాకగా.. చివరకు 897.28 పాయింట్ల నష్టంతో 58,237.85 దగ్గర ముగిసింది. నిఫ్టీ 17,421.90 పాయింట్ల దగ్గర ప్రారంభమై 17,113.45 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 258.60 పాయింట్లు నష్టపోయి 17,154.30 వద్ద స్థిరపడింది. సోమవారం ఒక్కరోజే దాదాపు రూ.4 లక్షలకోట్ల మేర ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు అంచనా.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.258.95 లక్షల కోట్లకు క్షీణించింది. గత శుక్రవారం నాటికి రూ.262.94 కోట్లుగా ఉండేది. ఈక్విటీ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో షేర్లు భారీగా పతనమయ్యాయి. సోమవారం భారత స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ రంగ షేర్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్లో టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్ లాభపడగా.. హెచ్డీఎఫ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐచర్ మోటార్స్ నష్టపోయాయి.