EPFO-Higher pension | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికుల అధిక పెన్షన్ ఖరారుపై జాప్యం జరుగుతున్నది. అర్హులైన కార్మికులు, ఉద్యోగులకు అధిక పెన్షన్ ఇవ్వాల్సిందేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చి ఏడాది గడిచినా.. ఆ దిశగా ఈపీఎఫ్ఓ ఎటువంటి పురోగతి సాధించలేదు. ఉద్యోగులు, కార్మికుల నుంచి అధిక పెన్షన్కు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించిన ఈపీఎఫ్ఓ.. ఆయా దరఖాస్తుల పరిష్కరించే విషయమై ఆ సంస్థ రీజినల్ కార్యాలయాలకు క్లారిటీ ఇవ్వడం లేదు. దేశవ్యాప్తంగా అధిక పెన్షన్ కోసం 17.48 లక్షల మంది దరఖాస్తు చేస్తే.. 32,592 మందికి మాత్రమే పెన్షన్ నిధి కోసం ఎంత మొత్తం అదనంగా చెల్లించాలో తెలియజేస్తూ నోటీసులు జారీ చేసింది. కేవలం 1.8 శాతం మంది దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చిన ఈపీఎఫ్ఓ వేతన జీవులు పే చేయాల్సిన బకాయి రూ.1,974 కోట్లుగా పేర్కొంది. ఈపీఎఫ్ఓ ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా కొందరు అదనపు సొమ్ము కట్టినా.. పెన్షన్ గణనపై క్లారిటీ కొరవడింది.
ఉద్యోగులు, కార్మికుల అధిక పెన్షన్ అంశంపై గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. పెన్షన్కు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ తర్వాత ప్రక్రియ చేపట్టడంలో ఈపీఎఫ్ఓ తీవ్ర జాప్యం చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించినా.. వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు పూనుకోవడం లేదు.
అధిక పెన్షన్ అర్హత గల వేతన జీవులు ఈపీఎఫ్ చందాలో కనీస వేతనం + డీఏలో 8.33 శాతానికి బదులు 9.49 శాతం చెల్లించాలని నోటీసు జారీ చేసింది. ఈపీఎఫ్ఓ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని.. దరఖాస్తుదారుల నుంచి హామీ తీసుకున్నా.. తదనుగుణంగా చర్యలు తీసుకోవడంలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ వెనుకంజ వేస్తున్నది. ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం నుంచి క్లారిటీ లేకపోవడంతో సంస్థ రీజినల్ కార్యాలయాలు అధిక పెన్షన్ల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిలిపేశాయి.
ఇక పెన్షనర్లలో సుమారు 4.10 లక్షల మంది అధిక పెన్షన్ కోసం అప్లయ్ చేశారు. కానీ, ఈపీఎఫ్ఓ వారిలో ఒక్కరికే నోటీసు జారీ చేసింది. గత నెల 31న జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, అధిక పెన్షన్ కోసం అదనపు నగదు చెల్లించిన సబ్స్క్రైబర్లకు హయ్యర్ పెన్షన్ వసతి కల్పిస్తామని సీబీటీకి ఇచ్చిన నివేదికలో ఈపీఎఫ్ఓ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకున్నది.