ముంబై, జనవరి 19: దేశీయ మార్కెట్లో విలీన-కొనుగోళ్ల లావాదేవీల (మెర్జర్ అండ్ అక్విజిషన్స్ లేదా ఎంఅండ్ఏ డీల్స్) విలువ గత ఏడాది పెద్ద ఎత్తున పడిపోయింది. 2022తో పోల్చితే 2023లో సగానికిపైగా తగ్గిపోవడం గమనార్హం. నిరుడు 66 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థోంటన్ భారత్ శుక్రవారం విడుదల చేసిన నివేదిక చెప్తున్నది. అంతకుముందు ఏడాది 152 బిలియన్ డాలర్లుగా ఉన్నది. డీల్స్ పరంగా చూసినా క్షీణతే కనిపిస్తున్నది. 2023లో 1,641 డీల్స్ జరుగగా, 2022తో చూస్తే ఇది 20 శాతానికిపైగా తక్కువ. కాగా, దేశ జీడీపీ వృద్ధిరేటు బాగానే ఉన్నప్పటికీ మదుపరులు వేచిచూసే ధోరణిని అవలంభించడమే ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో ద్రవ్య కొరత, మార్కెట్ ఒడిదుడుకులు కూడా ఎంఅండ్ఏ డీల్స్ను దించేశాయని గ్రాంట్ థోంటన్ భారత్ భాగస్వామి శాంతి విజేత అంటున్నారు.
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్.. అవకాశాల గనిగా విరాజిల్లుతున్నది. అయితే కరెన్సీ మార్కెట్లో రూపాయి తీరు, అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత.. మదుపరులను ఊగిసలాటకు గురిచేస్తున్నది. ఈ సవాళ్లను భారత్ అధిగమించాల్సిన అవసరం ఉన్నది’ అని విజేత అన్నారు. ఇదిలావుంటే నిర్మాణ రంగంలో జరిగిన సురక్ష గ్రూప్-జైపీ 2.5 బిలియన్ డాలర్ల లావాదేవీనే నిరుడు అతిపెద్ద డీల్గా ఉన్నట్టు తేలింది. కాగా, 2023లో మొత్తం 57 సంస్థలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో)కు వచ్చాయి. మరోవైపు 6.2 బిలియన్ డాలర్ల నిధులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి సమీకరించాయి. అయినప్పటికీ 2022తో చూస్తే భారీగా తగ్గినట్టు గణాంకాలు చెప్తున్నాయి.
దేశంలో విలీన-కొనుగోళ్ల లావాదేవీలు (బిలియన్ డాలర్లలో)
సంవత్సరం విలువ