Musk gets Support Union Minister | దిగుమతి చేసుకున్న టెస్లా కార్లకు రాయితీలు ఇవ్వాలన్న ఆ సంస్థ సీఈవో ఎలన్మస్క్తో కేంద్ర ప్రభుత్వం ఎడమొహం పెడమొహం అన్నట్లు వ్యవహరిస్తున్నది. కానీ ఓ విషయంలో మాత్రం ఎలన్మస్క్ను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమర్థించారు. 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేసుకోనున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం పూర్తయిన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తామని ఎలన్మస్క్ సూత్రప్రాయంగా చెప్పారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై ఎలన్మస్క్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమర్థించారు.
విద్వేషపూరిత ట్వీట్లు చేస్తూ అనవసర గొడవలకు కారణమవుతున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా బహిష్కరించింది. అలా ట్విట్టర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడే ఎలన్మస్క్ వ్యతిరేకించారు. డొనాల్డ్ ట్రంప్పై శాశ్వత నిషేధం అనైతికం అని అభిప్రాయ పడ్డారు. వాక్ స్వాతంత్య్రానికి అవకాశం ఉండాలనే నినాదంతో ట్విట్టర్లో పోల్స్ నిర్వహిస్తూ ఆ సంస్థనే స్వాధీనం చేసుకోబోతున్నారు.
ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిలువరించలేకపోవడం తన వైఫల్యం అని ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ తనకు చెప్పారని ఎలన్మస్క్ అన్నారు. ట్రంప్ ఖాతాపై శాశ్వత నిషేధం తన వైఫల్యం అంటూ జాక్ డోర్సీ చెప్పారన్న మస్క్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రీ ట్వీట్ చేశారు. ఒక వేదిక నుంచి ఒక వ్యక్తిపై శాశ్వత నిషేధం విధించడం యూజర్ల ప్రాథమిక హక్కును హరించడమేనన్నారు. అలా జరుగవద్దంటే బలమైన చట్టాలు తేవాలని చంద్రశేఖర్ అన్నారు.