హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాలకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొనుగోలునకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీంట్లోభాగంగా జార్ఖండ్నకు చెందిన ప్రముఖ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్తో సింగరేణి తొలి ఒప్పందం కుదుర్చుకున్నది. నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఏడాదికి 43 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలుకు అంగీకారం కుదిరింది. మంగళవారం సింగరేణి భవన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూమెంట్) జే అల్విన్ సమక్షంలో సింగరేణి జీఎం(మార్కెటింగ్) కే సూర్యనారాయణ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఇంధన శాఖ) తరుణ్ కుమార్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా జీఎం సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఒడిశాలో సింగరేణి చేపట్టిన నైనీ బ్లాక్ నుంచి బొగ్గు కొనుగోలుకు వివిధ రాష్ర్టాల్లోని ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లు, తమిళనాడు జెన్కో కూడా ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. త్వరలో మరో మూడు కంపెనీలతో బొగ్గు సరఫరాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలతోపాటు ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న ఇతర రాష్ర్టాలకు సైతం తగినంత బొగ్గును సకాలంలో అందిస్తున్నామని, రానున్న విద్యుత్ గరిష్ట వినియోగ సమయంలో కూడా తగినంత బొగ్గు అందించడానికి సింగరేణి సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డీజీఎంలు ఎన్వీ రాజశేఖర రావు, తాడబోయిన శ్రీనివాస్, సత్తు సంజయ్, ఎస్వోఎం సురేందర్ రాజు, అడిషనల్ మేనేజర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.