Investers Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లలో మరోరోజు నిరాశ మిగిలింది. వరుసగా మూడో సెషన్లో షేర్లు పతనమయ్యాయి. మంగళవారం ఎడతెగని అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 844 పాయింట్ల పతనంతో 57,147, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 257 పాయింట్ల లాస్తో 16983 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి. దీంతో దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు రూ.4.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.270 లక్షల కోట్లకు పడిపోయింది.
ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్ల్టే ఇండియా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్ 2-35 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ రియాల్టీ భారీగా 3.07 శాతం నష్టాలతో ముగిసింది. నిఫ్టీ మెటల్, మీడియా, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో ఇండెక్స్లు నష్టాలతో స్థిర పడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 1.68 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.57 శాతం నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణాలివి..
సూక్ష్మ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) మార్కెట్ల నుంచి ఈక్విటీలు భారీగా విక్రయించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.7,600 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. ఈ నెలలో నికర వాటాల విక్రయం విలువ రూ.1500 కోట్లకు చేరుకుంది. సోమవారం ఒక్కరోజే రూ.2,139 కోట్ల విలువైన షేర్లు వదిలించుకున్నారు.
అమెరికా ఫెడ్ రిజర్వు మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నట్లు సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ఆసియా మార్కెట్లు మంగళవారం అంతా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. జపాన్ నిక్కీ-225 2.64 శాతం, సౌత్ కొరియా కొస్పీ 1.83, హాంకాంగ్ స్టాక్స్ హాంగ్సెంగ్ 2.2 శాతం పతనం అయ్యాయి. యూరప్లో వరుసగా ఐదో రోజు బ్లూచిప్ ఎఫ్టీఎస్ఈ-100 1.1 శాతం నష్టంతో ముగిసింది. వచ్చే నెలలో 75 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ఫెడ్ రిజర్వు ప్రకటించడంతో అమెరికా ట్రెజరీ బాండ్లు పదేండ్ల స్థాయికి 3..99 శాతం నష్టపోయాయి.
ఆర్బీఐ మద్దతుతో మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ ఐదు పైసలు బలపడి రూ.82.35 వద్ద స్థిర పడింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 112 పాయింట్ల మార్క్పైనే కొనసాగుతుండగా, రూపాయి 11 శాతం పతనం కావడంతో ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. వచ్చే 6-9 నెలల్లో ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని జేపీ మోర్గాన్ సీఈవో జామై డిమోన్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. బ్రిటన్ ఆర్థిక సుస్థిరత కోసం 5 బిలియన్ల పౌండ్లను (5.51 బిలియన్ డాలర్లు) కొనుగోలు చేస్తామని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తెలిపింది.