EV Vehicles | న్యూఢిల్లీ, జూలై 28: సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశీయ విద్యుత్తు ఆధారిత (ఈవీ) ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమను కుదిపేస్తోంది. పలు ఈవీ కంపెనీలు.. ఇప్పటిదాకా టూవీలర్ కొనుగోలుదారులకు తాము ఇచ్చిన అదనపు రాయితీని తిరిగి తీసుకోవడానికి అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం ఓ లేఖ రాశాయి. రిబేట్ రిఫండ్కున్న అవకాశాలను పరిశీలించాలంటూ ప్రధాని కార్యాలయాన్ని అభ్యర్థించాయి. మొత్తం ఏడు సంస్థలు ఈ విజ్ఞప్తి చేయగా, అందులో హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, రివోల్ట్ వంటి పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. అయితే తాజా లేఖతో ఈవీ ఇండస్ట్రీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంఎన్ పాండేను ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీదారుల సంఘం (ఎస్ఎంఈవీ) సైతం కోరింది.
దేశంలో విద్యుత్తు ఆధారిత వాహన వినియోగాన్ని వీలైనంత త్వరగా పెంచాలన్న లక్ష్యంతో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) 2 స్కీమును మోదీ సర్కారు తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కీం కింద ఇచ్చే సబ్సిడీ నిబంధనల్ని కొన్ని ఈవీ తయారీదారులు ఉల్లంఘించారని, ఇందులో భాగంగానే ఫేస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ (పీఎంపీ)ను అనుసరించలేదని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తరఫున ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన దర్యాప్తులో తేలింది. ఈవీల తయారీలో వినియోగించే విడిభాగాల్లో కనీసం 50 శాతం భారత్లో తయారైనవి ఉండాలన్న నియమాన్ని ఆయా కంపెనీలు పట్టించుకోలేదంటున్నారు. దీంతో జరిమానా కింద తామిచ్చిన సబ్సిడీల్లో రూ.469 కోట్ల ప్రోత్సాహకాలను తిరిగి చెల్లించాలంటూ సదరు ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వాహన కొనుగోళ్లపై కస్టమర్లకు గతంలో తామిచ్చిన రాయితీలో కొంత వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కంపెనీలు కేంద్రానికి లేఖ రాశాయి.
ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్నట్టు తమపట్ల మోదీ సర్కారు తీరు ఉన్నదని ఇప్పుడు ఈవీల తయారీ కంపెనీలు వాపోతున్నాయి. మొన్నటిదాకా ప్రోత్సాహకాలు ఇస్తామని వెంటబడి పెట్టుబడులు పెట్టించిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు పాలసీలను మార్చి తమ వెన్ను విరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితులు ఇలాగే ఉంటే తాము దివాలా తీయడం ఖాయమన్న ఆందోళనను వెలిబుచ్చుతున్నాయి. కాగా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తమ నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ (నాబ్) సర్టిఫికేషన్ను బ్లాక్ చేసిందని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఫేమ్-2 సబ్సిడీకి దరఖాస్తు చేసుకునేందుకు ఇదే ముఖ్యమని గుర్తుచేస్తున్నాయి. అయితే రూ.469 కోట్లు ఇస్తేనే నాబ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ గురించి ఆలోచిస్తామని సదరు మంత్రిత్వ శాఖ తేల్చి చెప్తున్నది. దీంతో ఈవీ ఇండస్ట్రీ ఒక్కసారిగా సంక్షోభంలో పడ్డైట్టెంది.
హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపెర్ ఈవీ, రివోల్ట్ మోటర్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలకు కేంద్రం నుంచి నోటీసులు వచ్చాయి. ఇందులో హీరో ఎలక్ట్రిక్ రూ.133 కోట్లు, ఒకినావా రూ.116 కోట్లు చెల్లించాలంటూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాఖీదులు ఇచ్చినట్టు సమాచారం. నిజానికి ఇప్పటికే సబ్సిడీ నిబంధనల మార్పుతో ఈవీ టూవీలర్ల ధరలు పెరిగిపోయాయి. ఇది అమ్మకాలను దెబ్బ తీస్తుండగా, మరోవైపు ప్రభుత్వం తీరుతో కంపెనీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
‘మాకు రావాల్సిన రూ.1,500 కోట్ల బకాయిలపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. కానీ జరిగిన ఒక్క తప్పును ఎత్తిచూపుతూ ఇలా జరిమానాలకు దిగుతున్నది. ఇది సుపరిపాలనకు విరుద్ధమైన చర్య’
-సంజయ్ కౌల్, ఎస్ఎంఈవీ ప్రతినిధి