ముంబై, జూలై 1: ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను భారత్ జీడీపీ అంచనాను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం తగ్గించింది. ఈసారి 7.3 శాతానికే వృద్ధిరేటు పరిమితం కావచ్చన్నది. అయితే ఇంతకుముందు 7.8 శాతంగా నమోదు కావచ్చని తెలిపింది. అధిక చమురు ధరలు, నెమ్మదించిన ఎగుమతులు, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం వృద్ధి కోతలకు కారణంగా పేర్కొన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7.2 శాతంగా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో ఇప్పుడు క్రిసిల్ అంచనా కూడా దీనికి దరిదాపుల్లోకే వచ్చింది. కాగా, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు దేశ జీడీపీని పెంచగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.