India | ముంబై, మే 6: అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల రద్దీలో 2027-28కల్లా సగం వాటా భారతీయ ఎయిర్లైన్స్దేనని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 43 శాతంగా ఉందన్న క్రిసిల్.. 2028 మార్చి చివరి నాటికి దాదాపు 50 శాతానికి (700 బేసిస్ పాయింట్లు) చేరవచ్చన్నది.
కొత్తగా వివిధ దేశాలకు విమాన సేవలను భారతీయ విమానయాన సంస్థలు విస్తరిస్తుండటం, ఇందుకు తగ్గట్టుగా పెద్ద ఎత్తున నూతన విమానాలను కొనుగోలు చేస్తుండటం కలిసొస్తున్నదని క్రిసిల్ చెప్పింది. 2023-24లో భారతీయ అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ సుమారు 7 కోట్లను తాకింది. కరోనాతో ప్రభావితమైన 2020-21లో కోటిగానే ఉన్నది. దీంతో కరోనాకు ముందున్న డిమాండ్ నెలకొన్నట్టు క్రిసిల్ తెలియజేసింది.