న్యూఢిల్లీ, జనవరి 26: గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో వేగంగా వృద్ధిచెందిన ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు ఈ జనవరి నెలలో క్షీణబాట పట్టాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో పలు రాష్ర్టాల్లో నియంత్రణలు విధించడంతో 2022 జనవరి తొలి 15 రోజుల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు గత నెలతో పోలిస్తే 9.9 శాతం తగ్గాయని రిటైల్ ఇంటిలిజెన్స్ ప్లాట్ఫామ్ బిజామ్ వెల్లడించింది. దేశంలోని 75 లక్షల రిటైల్ స్టోర్స్ను ఈ ప్లాట్ఫామ్ ట్రాక్ చేస్తుంది. పూర్తిగా పనిచేసే కిరాణా దుకాణాల్లో 8.4 శాతం జనవరి ప్రధమార్థంలో మూతపడ్డాయని, ఎఫ్ఎంసీజీ అమ్మకాలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని బిజామ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అక్షయ్ డిసౌజా తెలిపారు. ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులకు డిమాండ్ 22.8 శాతం తగ్గగా, బేవరేజెస్ అమ్మకాలు 12.5 శాతం క్షీణించాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్నా, క్లీనింగ్, హైజీన్ ఉత్పత్తుల డిమాండ్ క్షీణించిందని, గతంలో ఉన్నంతగా తాజా వేవ్ పట్ల వినియోగదారుల్లో భయాలు లేవనడానికి ఇది నిదర్శనమంటూ బిజామ్ వివరణ.