GCC | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయి. భారత్లో నిర్మాణ రంగ వ్యయాలు తక్కువగా, నైపుణ్యం-ప్రతిభ కలిగిన ఉద్యోగుల లభ్యత ఎక్కువగా ఉండటం వల్లే ఆయా దేశాల్లోని కంపెనీలు తమ జీసీసీల కోసం ఇటువైపు చూస్తున్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లీర్స్ ఇండియా అంటున్నది. ‘భారత్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు-నూతన విశ్వాసం’ పేరుతో బుధవారం ఓ నివేదికను కొల్లీర్స్ ఇండియా విడుదల చేసింది.
5 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) 4.5 నుంచి 5 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను విదేశీ కంపెనీలు లీజుకు తీసుకోవచ్చని కొల్లీర్స్ అంచనా వేస్తున్నది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ గ్రేడ్ కార్యాలయ స్థలాలకు డిమాండ్ మరింతగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే 2022-23లో దేశంలోని 6 ప్రధాన నగరాల్లో 3.95 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు పోయిందని గుర్తుచేసింది.
నిజానికి దేశీయ ఆఫీస్ స్పేస్ డిమాండ్లో 40 శాతం జీసీసీ కంపెనీలదేనని కొల్లీర్స్ పేర్కొన్నది. కాగా, దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ జీసీసీల ఏర్పాటును విదేశీ బహుళజాతి సంస్థలు పరిశీలిస్తున్నాయని చెప్తున్నది. అయితే ఇంకా వెంటాడుతున్న కరోనా భయాలు, అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితుల మధ్య కంపెనీలు జీసీసీల ఏర్పాటు విషయంలో వేచిచూసే ధోరణినే అవలంభిస్తున్నట్టు కొల్లీర్స్ తెలిపింది.
హైదరాబాద్దే హవా
దేశంలో జీసీసీలను ఏర్పాటు చేయాలని భావించిన విదేశీ కంపెనీలు.. హైదరాబాద్కే పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే బెంగళూరు తర్వాత హైదరాబాదే ఎక్కువ జీసీసీలను అందిపుచ్చుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి కూడా ఈ మేరకు కావాల్సిన సహకారం అందడంతో జీసీసీల హబ్గా హైదరాబాద్ నిలిచింది. ముఖ్యంగా నాటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ కలిసొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, పుణె నగరాలను దాటి హైదరాబాద్ నగరం దూసుకెళ్లినట్టు గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసిన నాస్కామ్ నివేదిక చెప్తున్నది.