న్యూఢిల్లీ, డిసెంబర్ 26: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భారీ కంపెనీ (మెయిన్-బోర్డ్ ఐపీవో)ల పబ్లిక్ ఇష్యూల విలువ తగ్గుముఖం పట్టింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల సంఖ్య పెరిగినా.. నిధుల సమీకరణ మాత్రం పడిపోయింది. ఈ ఏడాది 58 భారీ ఐపీవోలు రాగా, వాటి విలువ రూ.52,637 కోట్లుగా నమోదైంది. ఇందులో రూ.3,200 కోట్ల నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ రీట్ ఐపీవో కూడా ఉన్నది. అయి తే నిరుడు 40 ఐపీవోలే వచ్చినప్పటికీ వాటి ద్వారా ఆయా సంస్థలు రూ.59,302 కోట్ల నిధులను సమీకరించాయి. కానీ ఇందులో మూడింటా ఒక వంతు (35 శాతం) ఒక్క ఎల్ఐసీ ఐపీవోదే కావడం గమనార్హం.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఐపీవో విలువ రూ.20,557 కోట్లుగా ఉన్నది మరి. ఇక అంతకుముందు ఏడాది 2021లో 69 కంపెనీలు ఏకంగా రూ.1.2 లక్షల కోట్ల నిధులను చేజిక్కించుకున్నాయి. ఒక ఏడాది ఈ స్థాయిలో భారీ కంపెనీల పబ్లిక్ ఇష్యూల విలువ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్లే ఈసారి ఐపీవోల విలువ ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయాలు మార్కెట్ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి అనుమతులు పొంది నా.. ఐపీవోలకు ఇంకా రాని కంపెనీలు దా దాపు 24 ఉన్నా యి. వీటన్నిటి విలువ రూ.26,000 కోట్లపైనే. ఇక మరో 32కుపైగా సంస్థలు తమ డ్రాఫ్ట్ పేపర్లను సెబీ వద్దకు ఐపీవోల అనుమతి కోసం పంపించాయి. ఆమోదం లభిస్తే మార్కెట్ల నుంచి రూ.35,000 కోట్లకుపైగా నిధులను ఇవి సమీకరించే వీలున్నది. దీంతో అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది రికార్డు స్థాయిలో ఐపీవోలు మార్కెట్ను తాకడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది వచ్చిన ఐపీవోల్లో చిన్న, మధ్యతరహా సంస్థలవి 181 ఉన్నాయి. వీటి విలువ రికార్డు స్థాయిలో రూ.4,643 కోట్లు.