హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఒడిశాలో సింగరేణికి చెందిన నైనీ బొగ్గు బ్లాకు, వీకే 7 ఓపెన్ కాస్ట్ గనుల నుండి తక్షణమే ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఈ యేడు 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియా జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, అంతే పరిమాణంలో రవాణా జరపాలని నిర్ణయించుకున్నప్పటికీ ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా లక్ష్యసాధనలో కాస్త వెనుకపడ్డామన్నారు. దీనిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అంతే పరిమాణంలో రవాణా జరుపాలన్నారు.
వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రాంతీయ జనరల్ మేనేజర్లు సంబంధిత గనుల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నిర్దిష్టమైన ప్రణాళికతో లక్ష్యాలు సాధించేలా చూడాలని సూచించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ప్రస్తుతం వెనుకబడివున్న కొత్తగూడెం, భూపాలపల్లి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి గనుల్లో ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఇతర పరిశ్రమల నుంచి బొగ్గుకు అధిక డిమాండ్ వస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.