Citigroup | అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ `సిటీ గ్రూప్` ఆదాయంతోపాటు లాభాలను పెంచుకోవడానికి పునర్వ్యవస్థీకరణ పేరుతో 10 శాతం మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపనున్నది. 2021లో సిటీ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన జేన్ ఫ్రాజర్.. బ్యాంకు పనితీరు మెరుగుదలకు, లాభాల పెంపునకు కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆమె పునర్వ్యవస్థీకరణ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకు మేనేజర్లు, కన్సల్టెంట్లతో చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు `ప్రాజెక్ట్ బోరాబోరా` అని అంతర్గతంగా ఒక పేరు పెట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 2.40 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
లాభాలను పెంచుకోవడానికి బ్యాంకు నియంత్రణ అధికారాలను సీఈవో జేన్ ఫ్రాజర్కు కట్టబెట్టాలని సిటీ గ్రూప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండ్లకు సాగనంపనున్న ఉద్యోగుల జాబితా తయారవుతున్నదని, ప్రస్తుత త్రైమాసికంలో ఖర్చుల ఆదా, ఉద్యోగుల తొలగింపుతో తలెత్తే ప్రభావాన్ని అంచనా వేసే పనిలో బ్యాంకు యాజమాన్యం ఉందని వార్తలొచ్చాయి.
బ్యాంకు పనితీరు సరళతరం చేయడం ద్వారా స్టాక్ ధర పెంపు.. తద్వారా వాటాదారులు, వ్యాపారవేత్తల్లో నమ్మకం పెంపొందించడమే సిటీ గ్రూప్ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకున్నది. ఉద్యోగుల ఉద్వాసనపై చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని సిటీ గ్రూప్ వర్గాల కథనం. ఉద్యోగుల తొలగింపునకు బోస్టన్ కేంద్రంగా పని చేస్తున్న ఓ కన్సల్టెన్సీ కంపెనీని నియమించుకున్నదని వార్తలొచ్చినా.. దానిపై సిటీ గ్రూప్ స్పందించడానికి ముందుకు రావట్లేదు.
బ్యాంకు రీజనల్ మేనేజర్లు, కో-హెడ్స్, ఇతర కీలక విభాగాల ఎగ్జిక్యూటివ్లను తప్పించడం, ప్రధాన విభాగాల విలీనం తదితర చర్యలు చేపట్టనున్నారు. సిటీ గ్రూపులో ఉన్న 13 అంచెల వ్యవస్థను ఎనిమిది అంచెలకు కుదిస్తారు. లీడర్షిప్ స్థాయిలో రెండు లేయర్లు, 15 శాతం ఫంక్షనల్ రోల్స్ తగ్గిస్తారు. 60 కమిటీలకూ పూర్తిగా ఉద్వాసన పలుకుతున్నట్లు తెలుస్తున్నది.