Service Charges | ముంబై, మే 22: మీరు రూ.2000 నోట్లను మార్చుకోవడానికి బదులు మీ బ్యాంక్ ఖాతాలో జమచేయాలనుకుంటున్నారా? వాటిపై సర్వీస్ చార్జీలు పడే అవకాశం ఉంది ఒకసారి మీ బ్యాంక్తో ఒకసారి చెక్ చేసుకోండి. రూ.2,000 నోట్ల మార్పిడి ఉచితమేనని రిజర్వ్బ్యాంక్ ప్రకటించినప్పటికీ, బ్యాంక్ ఖాతాలో జరిగే డిపాజిట్లపై సాధారణ నిబంధనలే వర్తిస్తాయని తెలిపింది. 2023 సెప్టెంబర్ వరకూ రెండు వేల నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునేందుకు రిజర్వ్బ్యాంక్ అనుమతించిన సంగతి తెలిసిందే. ఒక నెలలో ఒక పరిమితిని మించి బ్యాంక్ శాఖల్లో చేసే నగదు లావాదేవీలపై (డిపాజిట్లు, విత్డ్రాయిల్స్) పలు బ్యాంక్లు సర్వీసు చార్జీలు విధిస్తున్నాయి. వివిధ బ్యాంక్ల చార్జీలివి…
ఎస్బీఐ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ సమాచారం ప్రకారం ఒక నెలలో రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలో మూడు నగదు డిపాజిట్ లావాదేవీల వరకూ ఉచితం. ఈ పరిమితి తర్వాత ఒక్కో డిపాజిట్కు రూ.50+జీఎస్టీ సర్వీస్ చార్జీని బ్యాంక్ విధిస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: స్వయంగా లేదా థర్డ్పార్టీ జరిపే డిపాజిట్లు, విత్డ్రాయిల్ లావాదేవీలు నెలకు నాలుగు వరకూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఉచితం. అంతకు మించితే లావాదేవీకి రూ. 150+జీఎస్టీ చొప్పున చార్జీ విధిస్తుంది. నెలలో మీరు చేసే డిపాజిట్ రూ. 2 లక్షలకు మించితే, ప్రతీ వెయ్యి రూపాయలకు రూ.5 లేదా రూ.150+పన్నులు ఏది ఎక్కువైతే దానిని చెల్లించాలని బ్యాంక్ వెబ్సైట్ వెల్లడిస్తున్నది.
ఐసీఐసీఐ : డిపాజిట్లు, విత్డ్రాయిల్స్తో కలిపి నెలకు నాలుగు ఉచిత లావాదేవీలను ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్నది. ఈ పరిమితిని దాటితే లావాదేవీకి రూ.1000కు రూ. 5 లేదా రూ.150 ఏది ఎక్కువైతే ఆ చార్జీని వసూలు చేయనునున్నట్టు బ్యాంక్ వెబ్సైట్ వెల్లడిస్తున్నది.
కొటక్ మహీంద్రా: రూ.3 లక్షల పరిమితి లేదా విత్డ్రాయిల్స్, డిపాజిట్ల ఐదు ఉచిత లావాదేవీలు ఏవి ముందు పూర్తయితే, దానితర్వాత కొటక్ మహీంద్రా బ్యాంక్ సర్వీస్ చార్జీలను విధిస్తుంది. ఈ పరిమితుల్ని మించిన తర్వాత లావాదేవీకి కనీస చార్జి రూ. 150+పన్నులు లేదా రూ.1000కు రూ. 4.5 చొప్పున సర్వీసు రుసుం చెల్లించాలని బ్యాంక్ వెబ్సైట్ తెలియపరుస్తున్నది.