న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కంపెనీల్లో కట్టుదిట్టమైన ఆడిటర్ల వ్యవస్థ కోసం త్వరలో కఠిన నిబంధనల్ని తీసుకురానున్నది. 2018లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్) గ్రూప్ సంస్థల వైఫల్యం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆడిటింగ్ లోపాల సవరణ, చట్టబద్ధ ఆడిటర్ల స్వతంత్రతను కాపాడే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఆడిటింగ్ సంస్కరణల నివేదికపై సంప్రదింపుల్ని పూర్తిచేసిన కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఆ వివరాలను నిపుణుల కమిటీ ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖకూ సమర్పించింది. ప్రస్తుతం కార్పొరేట్ వ్యవహారాలు, ఆర్థిక శాఖలకు నిర్మలా సీతారామనే మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, కంపెనీల చట్టం సవరణకు ఓ ముసాయిదా బిల్లును తెచ్చే ప్రయత్నాలు ఇక మొదలవుతాయని సంబంధిత వర్గాల్లో ఒకరు చెప్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్లో కాంపిటీషన్ చట్టం సవరణ కోసం ఓ బిల్లు తుది దశలో ఉన్నది. అలాగే దివాలా సంస్కరణలపైనా ఆఖరు దశలోనే ఉంది.