కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐటీ) చెల్లించకపోతే.. ఇక నుంచి అధిక టీడీఎస్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పటిదాకా రెండేండ్ల వరకు గడువు ఉండేది. మూడో ఏడాది నుంచే అధిక టీడీఎస్ను చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ జూలైలోపు ఐటీ చెల్లింపులను పూర్తిచేయాలి. గతేడాది మాదిరిగా పోర్టల్ సమస్య కారణంగా వాయిదా పడితే తప్ప.. ఈ గడువు ఈసారి మారకపోవచ్చు. ఒకవేళ జూలై 31లోపు చెల్లించకపోతే ఆ తర్వాత నుంచి వచ్చే ఆదాయంపై అధిక టీడీఎస్ను చెల్లించాల్సి ఉంటుంది.
టీడీఎస్ అంటే..
జీతాలు, కమీషన్లు, అద్దెలు, వడ్డీలు, ప్రొఫెషనల్ ఫీజులు తదితర చెల్లింపులు జరిగేటప్పుడు మినహాయించుకునే కొంత మొత్తాన్నే టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ లేదా ఆదాయ వనరు వద్దే పన్ను కోత) అంటారు. దీనివల్ల పన్ను ఎగవేతలు తగ్గుతాయని ఐటీ శాఖ చెప్తున్నది. ఎందుకంటే చెల్లింపుల సమయంలో ముందుగానే పన్నును మినహాయించుకుంటున్నారు కాబట్టి. ప్రాపర్టీ
అమ్మకాలు, డివిడెండ్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ వంటి వాటిపైనా పడుతుంది. అయితే ఏటా రూ.50,000 టీడీఎస్ చెల్లించేవారికే వర్తిస్తుంది. వేతనం ద్వారా వచ్చే ఆదాయాన్ని దీన్నుంచి మినహాయించారు. ఎన్నారైలకు చేసే చెల్లింపులు, అధిక విలువ కలిగిన అమ్మకాలపైనా వర్తింపజేశారు.
కొన్ని చిక్కులు
ట్యాక్స్ ఫైలింగ్ స్టేటస్ను ట్రాక్ చేసేందుకు ప్రతి కంపెనీ సాఫ్ట్వేర్లను వినియోగిస్తాయి. ఇక నుంచి రెండేండ్ల గడువు లేనందున దాదాపుగా రియల్ టైమ్లో చెల్లింపులను ట్రాక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందు కు తగ్గట్టుగా సాఫ్ట్వేర్లో కూడా మార్పులు చేర్పు లు చేయాల్సి ఉంటుంది. టీడీఎస్ మొత్తాలను ట్రాక్ చేయడం, అలాగే ట్యాక్సేషన్ రికార్డులను క్రమపద్ధతిలో
నిర్వహించడం చాలా శ్రమతో కూడకున్న పనే. అంతేగాక ఎంతో సమయాన్ని సైతం వెచ్చించాల్సి ఉంటుంది. టీడీఎస్ రిటర్న్లను త్రైమాసికానికి ఒకసారి ఫైల్ చేస్తారు. కానీ అప్పటికే టీడీఎస్ చెల్లించేసి ఉంటారు. దీంతో కొన్ని సందర్భాలలో అవసరమైన దానికన్నా అధిక టీడీఎస్ను మినహాయించుకోవచ్చు. ఈ చిక్కులన్నింటి నుంచి తప్పించుకోవాలంటే ఇక నుంచి గడువులోగానే
ఐటీ రిటర్న్లను దాఖలు చేయండి.
రెట్టింపు టీడీఎస్
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139-1 ప్రకారం, గడువు లోగా పన్ను చెల్లించకపోతే అధిక టీడీఎస్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈ ఆర్థిక సంవత్సరానికి మీరు జూలై 31లోగా ఐటీ రిటర్నులను దాఖలు చేయలేకపోయారనుకుందాం. ఆగస్టు నుంచి రావాల్సిన ఒక రాబడిపై దాన్ని చెల్లించే వ్యక్తి లేదా సంస్థ రెట్టింపు టీడీఎస్ను మినహాయించుకుంటుంది.