Budget 2024-25 | న్యూఢిల్లీ, జనవరి 29: రాబోయే మధ్యంతర బడ్జెట్లో తయారీ, మౌలికాభివృద్ధి రంగాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని దేశీయ పారిశ్రామిక వర్గాలు కోరుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమెంట్లో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే కీలక రంగాలకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటనల్ని పరిశ్రమ ఆశిస్తున్నది.
ప్రగతిదాయకంగా ఉండాలి
సార్వత్రిక ఎన్నికల ముందు వస్తున్నందున ఈసారి బడ్జెట్లో పెద్దగా ఎలాంటి ఆశ్చర్యకర ప్రకటనలు ఉండబోవని ఇప్పటికే మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు. అయినప్పటికీ పన్నుల విధానంలో అటు వ్యక్తులకు, ఇటు ఇండస్ట్రీకి మేలు జరిగే మార్పులు రావాలని ఇండస్ట్రీ కోరుకుంటున్నది.
ఇక రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలబెట్టేందుకు కావాల్సిన ప్రగతిదాయక నిర్ణయాలుంటాయన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. కానీ వీటన్నిటినీ మోదీ సర్కారు ఏమాత్రం నెరవేరుస్తుందోనన్న అనుమానాలూ బలంగానే ఉండటం గమనార్హం. నిజానికి గత బడ్జెట్లోనూ పన్నుల భారాన్ని తగ్గించిన దాఖలాలేమీ లేవు. కొత్త ఆదాయ పన్ను విధానాన్ని పరిచయం చేయడంతో.. అందులోనైనా ఈసారి శ్లాబులు/రేట్లను ప్రయోజనకరంగా సవరిస్తారా? లేదా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి.
సీఐఐ, ఫిక్కీ సలహాలివి..
ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంఘాలు సీఐఐ, ఫిక్కీ ఈసారి బడ్జెట్ దృష్ట్యా పలు సలహాలు, సూచనలు చేశాయి. ఇందులో ‘నేషనల్ మిషన్ ఫర్ అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్’ ఏర్పాటును సీఐఐ కోరింది. తయారీ రంగంలో నాణ్యతను, ఉత్పాదకతను పెంచడానికి దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తున్నది.
ఈ మిషన్తో దేశీయ తయారీ రంగ పరిశ్రమలను సాంకేతికంగా బలపర్చవచ్చంటున్నది. దుస్తులు, ఆటబొమ్మలు, పాదరక్షల వంటి రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపునకూ ఇది దోహదపడుతుందని పేర్కొంటున్నది. క్యాపిటల్ గూడ్స్, కెమికల్స్ తదితర రంగాలు దిగుమతులపై ఆధారపడే పరిస్థితి సైతం తగ్గుతుందని విశ్లేషిస్తున్నది. మరోవైపు వచ్చే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మూలధన వ్యయాన్ని పెంచాలని ఫిక్కీ కోరుతున్నది. గత బడ్జెట్లో 37.4 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చారని గుర్తు చేస్తున్నది.
దిగుమతి సుంకాలపై..
ప్రస్తుతం వైద్య ఉపకరణాల దిగుమతిపై సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ పవన్ చౌధరి అన్నారు. అధిక కస్టమ్స్ సుంకాలతో ఆయా పరికరాల విలువ పెరిగిపోతున్నదని, ఇది ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలకు విరుద్ధమని చెప్తున్నారు. వైద్య ఉపకరణాల ధరలు తక్కువగా ఉంటే నే.. చేసే వైద్య ఖర్చులూ తగ్గుతాయని గుర్తుచేస్తున్నారు.
ఈసారి ఆర్థిక సర్వే లేదు
ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశ పెట్టాల్సి వస్తున్నది. దీంతో ఆర్థిక సర్వే విడుదల కావడం లేదు. ఎన్నికల తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రకటిస్తుందో ఆ ముందురోజే ఆర్థిక సర్వే రానున్నది. దీంతో మే, జూన్, జూలై నెలల్లో ఆర్థిక సర్వేకు వీలున్నదంటున్నారు.
నిజానికి ఏటా బడ్జెట్కు ముందురోజే ఆర్థిక సర్వే విడుదలవుతుంది. కానీ ఎన్నికల ఏడాది మాత్రం తాత్కాలిక బడ్జెట్లే ఉంటాయి. కాబట్టే ఆర్థిక సర్వేలు రావు. ఇక 2018 నుంచి ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉంటున్నది. దీంతో జనవరి 31న ఆర్థిక సర్వే వస్తున్నది. అంతకుముందు మార్చి నెలలో బడ్జెట్ ఉండేది.
ఆ ముందురోజు ఆర్థిక సర్వే వచ్చేది. కాగా, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కనుసన్నల్లో ఆర్థిక వ్యవహారాల శాఖలోని ఆర్థిక విభాగం ఈ ప్రతిష్ఠాత్మక నివేదికను ఏటా సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం సీఈఏగా వీ అనంత నాగేశ్వరన్ ఉన్నారు. మరోవైపు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘ది ఇండియన్ ఎకానమీ: ఏ రివ్యూ’ పేరుతో ఓ రిపోర్టును తెచ్చింది. పెట్టుబడులు, హౌజింగ్, మహిళలు, స్థూల ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, రుణ భారం తీరుతెన్నులను వివరించారు.