Hindustan zinc | హిందుస్థాన్ జింక్ లిమిటెడ్కు కేంద్ర ప్రభుత్వం గుడ్బై చెప్పనున్నది. సంస్థలో మిగిలిన వాటాను కూడా అమ్మేందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేసింది. దేశీ రోడ్షోలతో మదుపరులను ఆకర్షించాలని చూస్తున్నది. ఈ వాటా విక్రయం పూర్తయితే కంపె నీ ప్రైవేట్పరం కానున్నది. అంతేగాక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జింక్ ఉత్పాదక సంస్థ సర్కారు చేజారనున్నది.
న్యూఢిల్లీ, జూన్ 6: హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లో వాటాను అమ్మేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అంతా సిద్ధం చేసింది. అన్ని కుదిరితే ఈ నెలలోనే మదుపరులను ఆకట్టుకునేందుకు విదేశాల్లో రోడ్షోలనూ నిర్వహించే అవకాశాలున్నాయి. అమెరికాతో ఈ తంతును మొదలు పెట్టాలని భావిస్తున్నట్టు సంబంధిత ఓ అధికారి తెలిపారు. హిందుస్థాన్ జింక్ సంస్థలో కేంద్రానికి ప్రస్తుతం 29.54 శాతం వాటా ఉన్నది. నిజానికి గత ఏడాదే ఈ వాటా విక్రయానికి కేంద్రం ప్రయత్నించింది. కానీ కంపెనీలో మెజారిటీ వాటా ఉన్న అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ ప్రతిపాదనతో బ్రేకులు పడ్డాయి. విదేశాల్లోని తమ జింక్ ఆస్తులను హెచ్జెడ్ఎల్కు అమ్మాలని వేదాంత కోరింది. అయితే సదరు ఆస్తుల మితిమీరిన విలువ కారణంగా ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో గత నెలతో వేదాంత చేసిన ప్రతిపాదనకు కాలం తీరిపోయింది. దీంతో ప్రభుత్వం తమ సొంత ప్రణాళిక అమలుకు బయలుదేరింది.
హెచ్జెడ్ఎల్ వాటాను వీలైనంత త్వరగా అమ్మేయాలని చూస్తున్న పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం).. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ముందుకెళ్తున్నది. పబ్లిక్ ఇన్వెస్టర్లతోపాటు సంస్థాగత మదుపరులకు ఈ వాటాను విక్రయించాలని చూస్తున్నట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం హెచ్జెడ్ఎల్లో వేదాంతకు 64.92 శాతం వాటా, ప్రభుత్వానికి 29.54 శాతం వాటాలున్నాయి. మరో 5.54 శాతం వాటా పబ్లిక్ షేర్ హోల్డర్స్కున్నది. కాగా, హెచ్జెడ్ఎల్ వాటా విక్రయంలో భాగంగా నిరుడు సింగపూర్, లండన్, అబుదాబీ, ముంబైల్లో రోడ్షోలు, అమెరికాలో వర్చువల్ ఇన్వెస్టర్ మీటింగ్లనూ కేంద్రం నిర్వహించింది. ఈ క్రమంలోనే మదుపరుల వద్దకు మరోసారి వెళ్లనున్నట్టు దీపం అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెల్లోనే మొదట అమెరికాలో, ఆ తర్వాత బ్రిటన్లో రోడ్షోలకు ప్లాన్ వేస్తున్నట్టు చెప్పారు.
సంస్థ : హిందుస్థాన్ జింక్ లిమిటెడ్
స్థాపన : 1966 (57 ఏండ్ల క్రితం)
ప్రధాన కేంద్రం : ఉదయ్పూర్ (రాజస్థాన్)
రంగం : గనులు
ఉత్పత్తులు : జింక్, లెడ్, సిల్వర్, కాడ్మియం
ఆదాయం : రూ.34,098 కోట్లు (2022-23)
లాభం : రూ.10,511 కోట్లు (2022-23)
ఉద్యోగులు : దాదాపు 20వేలు
హిందుస్థాన్ జింక్ ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థే. 2002-03లో అప్పటి వాజపేయి సర్కారు దీన్ని ప్రైవేట్పరం చేసింది. మొత్తం రెండు విడుతల్లో మెజారిటీ వాటాను వేదాంతకు అప్పగించింది. ఇప్పుడు మిగతా వాటాను అదే బీజేపీకి చెందిన మోదీ సర్కారు అమ్మేయాలని తహతహలాడుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంపై వార్షిక లక్ష్యాలను పెట్టుకునిమరి నిధుల సమీకరణకు తెగబడిపోతున్నది. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలనూ ప్రైవేట్కు అప్పగిస్తున్న కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. ఇటీవలే ఎయిర్ ఇండియాను టాటాలకు అమ్ముకున్న సంగతి తెలిసిందే. కోల్ ఇండియాలోనూ కొంత వాటాను విక్రయించినదీ విదితమే. ఇక అదానీ గ్రూప్ అక్రమాల్లో మోదీ హస్తంపై నడుస్తున్న రచ్చ చూస్తూనే ఉన్నాం.
హిందుస్థాన్ జింక్లోని 29.54 శాతం (124.79 కోట్ల షేర్లు) ప్రభుత్వ వాటా అమ్మకానికి గత ఏడాది ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఒక్కో షేర్ ధర రూ.307గా ఉన్నది. దీంతో ఈ వాటా అమ్మకంతో కేంద్రానికి దాదాపు రూ.38,000 కోట్ల నిధులు వస్తాయని అంచనా.