న్యూఢిల్లీ, నవంబర్ 13: కంపెనీల్లో వాటాల్ని విక్రయించి ద్రవ్యలోటును పూడ్చుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో పీఎస్యూను ఐపీవోకు సిద్ధం చేసింది. ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)లో తొలి పబ్లిక్ ఆఫర్ నవంబర్ 21న ప్రారంభం కానుంది. నవంబర్ 23న ఆఫర్ ముగుస్తుంది. గత ఏడాది మే నెలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవో తర్వాత పబ్లిక్కు వాటాల్ని ఆఫర్ చేస్తున్న ప్రభుత్వ సంస్థ ఇదేకావడం గమనార్హం.
ఈ ఆఫర్లో కేంద్ర ప్రభుత్వం 26.8 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. వీటితో పాటుగా రూ.10 ముఖ విలువ కలిగిన 40.3 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుంది. అంటే మొత్తం 67.1 కోట్ల షేర్లు ఈ ఐపీవో ద్వారా పబ్లిక్కు జారీచేయనున్నారు. ఆఫర్ ప్రైస్బ్యాండ్ను త్వరలో ప్రకటిస్తారు. ఆఫర్లో 50 శాతం అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. 35 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు.
రూ.47 వేల కోట్ల రుణ పోర్ట్ఫోలియో
కేంద్రం విక్రయించే షేర్ల ద్వారా లభించే సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే మొత్తాన్ని కంపెనీ తన భవిష్యత్ మూలధన అవసరాలకు, రుణ వితరణకు వాడుకుంటుంది. 36 ఏండ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐఆర్ఈడీఏ వివిధ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టులకు వివిధ దశల్లో రుణ సదుపాయాల్ని అందిస్తుంది. 2023 జూన్ నాటికి ఐఆర్ఈడీఏ వద్ద రూ.47,206 కోట్ల రుణ పోర్ట్ఫోలియో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన ప్రధమార్థంలో కంపెనీ ఆదాయం 47 శాతం వృద్ధితో రూ.2,320 కోట్లకు చేరగా, లాభం 41 శాతం వృద్ధితో రూ.579 కోట్లకు పెరిగింది. ఐపీవో తర్వాత ఐఆర్ఈడీఏ షేరు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టవుతుంది.