న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 2020 అక్టోబర్ 9న రాజేశ్వర్ రావు మూడేండ్లకుగాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారు. అయితే వచ్చే నెల అక్టోబర్ 8తో ఈ గడువు తీరిపోతున్నది. ఈ క్రమంలో ఇంకో ఏడాది పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 9 నుంచి ఇది అమల్లోకి రానుండగా, అప్పట్నుంచి ఏడాది లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏది ముందైతే దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని మంగళవారం ఆర్బీఐ తెలిపింది.
ప్రస్తుతం ఆర్బీఐలోని రెగ్యులేషన్, కమ్యూనికేషన్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలతోపాటు లీగల్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాల ఇంచార్జీగా రాజేశ్వర్ రావు ఉన్నారు. 1984లో ఆర్బీఐలో చేరిన రాజేశ్వర్ రావు.. కొచ్చిన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. 2016 నవంబర్లో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. తన కెరియర్లో హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీల్లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ పనిచేశారు. కాగా, ఆర్బీఐకి మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్లుంటారు. రాజేశ్వర్ రావు కాకుండా మిగతా ముగ్గురిలో జే స్వామినాథన్, టీ రవిశంకర్, ఎం.డీ పాత్ర ఉన్నారు.