న్యూఢిల్లీ, జనవరి 5: దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 7.3 శాతం వృద్ధిని సాధించగలదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను భారత ఆర్థిక వ్యవస్థపై శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తమ తొలి ముందస్తు అంచనాను వెలిబుచ్చింది. ఈసారి గనులు-త్రవ్వకాలు, తయారీ, ఇతరత్రా సేవా రంగాల ప్రదర్శన బాగుందన్నది. ఈ క్రమంలోనే తయారీ రంగంలో 6.5 శాతానికి, గనుల రంగంలో 8.1 శాతానికి ఉత్పాదకత పెరగవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇవి 1.3 శాతం, 4.1 శాతమేనని గుర్తుచేసింది. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ కూడా ఈసారి 8.9 శాతం వృద్ధిని అందుకోవచ్చని, పోయినసారి 7.1 శాతానికే పరిమితమయ్యాయని చెప్పింది. నాడు దేశ జీడీపీ 7.2 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఇదిలావుంటే 2011-12 ధరల ప్రకారం దేశ జీడీపీ విలువ 2023-24లో రూ.171.79 లక్షల కోట్లుగా ఉండొచ్చని ఎన్ఎస్వో అంచనా వేసింది. ఈ క్రమంలోనే వృద్ధిని 7.3 శాతంగా అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నది. కాగా, ఈసారి దేశ జీడీపీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 7 శాతంగానే అంచనా వేసిన సంగతి విదితమే.
ఈ ఏడాది 6.2 శాతం
ఈ ఏడాది (2024) భారత జీడీపీ వృద్ధిరేటు 6.2 శాతంగా నమోదు కావచ్చని ఐక్యరాజ్య సమితి (యూఎన్) అంచనా వేసింది. తయారీ, సేవా రంగాల్లో బలమైన వృద్ధికితోడు దేశీయ మార్కెట్లో భారీ ఎత్తున పెరిగిన డిమాండ్.. ఇండియన్ ఎకానమీకి కలిసొస్తుందన్న అభిప్రాయాన్ని యూఎన్ తమ తాజా వరల్డ్ ఎకనామిక్ సిచ్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టు 2024లో వ్యక్తం చేసింది. అలాగే 2025లో దేశ జీడీపీ 6.6 శాతానికి పెరగవచ్చన్నది. ఇక దక్షిణాసియాలో జీడీపీ వృద్ధి 5.2 శాతంగా ఉండొచ్చన్నది. భారత్లోని ఆశాజనక పరిస్థితులు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నది. కాగా, గత ఏడాది భారత్లో పెట్టుబడులు ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా నివేదికలో ఐక్యరాజ్య సమితి తెలిపింది.