ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్న బ్యాంక్లు.. మరోవైపు డిపాజిట్దారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీని పెంచగా.. పలు ప్రైవేట్ బ్యాంక్లు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నాయి. తాజాగా వీటిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరూర్ వైశ్యా బ్యాంక్ ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచేసింది. ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచిన మరుసటి రోజే రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీని సవరించింది. ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల లోపు కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీని 2.85 శాతం నుంచి 5.75 శాతం వరకు ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. దీంతోపాటు 555 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. సీనియర్ సిటిజన్లకు మాత్రం అర శాతం అధికంగా వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్.
కరూర్ వైశ్యా బ్యాంక్..
కరూర్ వైశ్యాబ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. 31 రోజుల నుంచి 10 ఏండ్లలోపు కాలపరిమితి కలిగిన రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీని సవరించింది. ఏడు రోజుల నుంచి 30 రోజుల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును మాత్రం యథాతథంగా 4 శాతంగా ఉంచింది. అలాగే 31 రోజుల నుంచి 45 రోజుల లోపు వడ్డీరేటును 4 శాతం నుంచి 5.25 శాతానికి పెంచింది. 46 నుంచి 90 రోజుల కాలపరిమితి కలిగిన వడ్డీరేటును కూడా 4.25 శాతం నుంచి 5.25 శాతానికి చేరింది. గతంలో 4.5 శాతం వడ్డీని చెల్లించిన 91-120 రోజుల ఎఫ్డీలపై ఈసారి దీనిని 5.25 శాతానికి పెంచగా..121 నుంచి 180 రోజుల వడ్డీని కూడా 4.5 శాతం నుంచి 5.50 శాతానికి సవరించింది. 181-270 రోజుల ఎఫ్డీలపై వడ్డీని 5.75 శాతం ఆఫర్ చేస్తుండగా, 271 నుంచి ఏడాది లోపు 5.90 శాతం, ఏడాది నుంచి రెండేండ్లలోపు 6.10 శాతం, రెండేండ్ల నుంచి మూడేండ్లలోపు 6.10 శాతం, మూడేండ్ల నుంచి ఆరేండ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీని 6.10 శాతం వరకు చెల్లిస్తున్నది. సీనియర్ సిటిజన్లకు మాత్రం మరో అర శాతం అదనంగా బ్యాంక్ చెల్లిస్తున్నది.