EV | న్యూఢిల్లీ, మార్చి 13 : ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో నూతన స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్కీం కోసం రూ.500 కోట్ల నిధులను ప్రకటించింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం మాత్రమే ఈ స్కీంను ప్రవేశపెట్టింది. గతంలో ప్రకటించిన ఫేమ్-2 ఈ నెల 31తో ముగియనుండటంతో ఈ సరికొత్త స్కీంను తెరపైకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ.. దేశంలో ఈ-మొబిలిటీ వాహనాలను ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ సర్కార్ కట్టుబడివున్నదని, ఈ సరికొత్త స్కీం జూలై చివరినాటికి అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ స్కీం కింద రూ.10 వేల వరకు ద్విచక్ర వాహనాలకు రాయితీ లభించనున్నది. 3.33 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహనాలకు వర్తించనున్నది. అలాగే చిన్న స్థాయి త్రి చక్ర వాహనాలు(ఈ-రిక్షా, ఈ-కార్ట్స్)లకు రూ.25 వేల వరకు రాయితీకి లభించనున్నాయి. 41 వేల వాహనాలకు వర్తించనున్నది. వీటితోపాటు అతిపెద్ద త్రి-చక్ర వాహనాలపై కూడా రూ.50 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తున్నది. గతంలో ప్రకటించిన ఫేమ్-2 స్కీం ఈ నెల చివరి నాటికి లేదా నిధులు ఉన్నంత వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహన స్కూటర్ల వాడకాన్ని ప్రోత్సహించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ..ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.