Tesla | న్యూఢిల్లీ, మార్చి 15: నూతన ఎలక్ట్రిక్-వెహికిల్ (ఈవీ) పాలసీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. ఈ కొత్త విధానం కింద 500 మిలియన్ డాలర్ల (రూ.4,150 కోట్లు)కు తగ్గకుండా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే దేశంలో ఏర్పాటుచేసే విద్యుత్తు ఆధారిత వాహనాల తయారీ కేంద్రాలకుగాను ఆయా సంస్థలకు పన్ను రాయితీలు అందుతాయి. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే బడా ప్యాసింజర్ కార్ల కంపెనీలే లక్ష్యంగా ఈ విధానం ఉండటం గమనార్హం. ఇక ఈ-వెహికిల్స్ కోసం భారత్లో తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసే కంపెనీలకు తక్కువ కస్టమ్స్ సుంకాలతో పరిమిత స్థాయిలో కార్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓ అధికారిక ప్రకటన చెప్తున్నది. పేరొందిన విదేశీ ఈవీ ఉత్పాదక సంస్థలచేత ఇక్కడ ప్లాంట్లను తెరిపించి.. భారత్ను ఈవీల తయారీ హబ్గా మార్చడమే ఈ పాలసీ ముఖ్యోద్దేశమని కూడా సదరు ప్రకటన పేర్కొన్నది.
పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన కంపెనీలు మూడేండ్లలోపు దేశంలో తయారీ కేంద్రాలను పెట్టి వాహనాల ఉత్పత్తిని కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే అందులో వాడే విడిభాగాల్లో కనీసం 25 శాతం భారత్లో తయారైనవే అయ్యుండాలి. ఐదేండ్లలోగా 50 శాతం విడిభాగాలు స్థానికంగా తయారైనవే ఉండాలి. అప్పుడే 15 శాతం దిగుమతి సుంకాల వద్ద ఏటా 8,000 కార్ల దిగుమతికి ఆయా కంపెనీలకు వీలుంటుంది. ఈ కార్ల విలువ 35,000 డాలర్లు, ఆపై ఉండాలి. అయితే 800 మిలియన్ డాలర్లు, ఆపై పెట్టుబడులు పెట్టిన సంస్థలకే ఈ అవకాశం. ఈ ప్రోత్సాహకాలు కూడా తొలి ఐదేండ్లే వర్తిస్తాయి. ప్రస్తుతం పూర్తిగా విదేశాల్లోనే తయారై దేశంలోకి దిగుమతి అవుతున్న ఈవీ కార్లపై వాటి ధరలు, ఇంజిన్ పరిమాణం ఆధారంగా 60 నుంచి 100 శాతం వరకు సుంకాలు పడుతున్నాయి.
అమెరికాకు చెందిన ఈవీల తయారీ దిగ్గజం టెస్లాను భారత్కు రప్పించడమే ధ్యేయంగా ఈ కొత్త పాలసీ ఉందన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. భారతీయ మార్కెట్లోకి రావాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న టెస్లా.. ఇక్కడి పన్నులతో వెనుకడుగు వేస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్రంపై టెస్లా విమర్శలు కూడా చేసింది. దీంతో ఆ సంస్థపై మోదీ సర్కారు పెద్దలు ప్రతి విమర్శలూ చేశారు. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలోనూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్.. టెస్లాకు సరిపోయేలా విధానాలను భారత్ రూపొందించబోదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఈవీల కంపెనీలను ఆకట్టుకునేలా తమ చట్టాలు, టారీఫ్ రూల్స్ ఉంటాయని చెప్పారు. అయినప్పటికీ టెస్లాను ఆకర్షించేందుకు కొత్త ఈవీ పాలసీతో కేంద్రం ప్రయత్నాలు చేసిందన్న వాదనలుండటం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వ కొత్త ఈవీ పాలసీ.. విదేశీ సంస్థలకు భారతీయ మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. పన్నులు తగ్గించిమరీ విదేశీ సంస్థలను దేశీయ విపణిలోకి తెస్తే.. ఇక్కడి కంపెనీల వృద్ధికి విఘాతం కలిగించినట్టేనని అంటున్నారు. కేవలం టెస్లాను ఆకట్టుకునేలా ఉందని, నిజానికి మొన్నటిదాకా ఆ సంస్థను తప్పుబట్టిన మోదీ సర్కారు యూటర్న్ ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదన్న వాదనలూ ఉన్నాయి. ఇదిలావుంటే 2030 నాటికి వార్షిక అమ్మకాల్లో ఈవీల వాటా కోటి యూనిట్లుగా ఉండొచ్చని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ ఈ పరిశ్రమ నుంచి వస్తాయని చెప్తున్నారు. 2022లో దేశీయ ఈవీ అమ్మకాలు దాదాపు 10 లక్షలుగా ఉన్నాయి. కంపెనీలపరంగా చూస్తే.. టాటా మోటర్స్ ముందున్నది. ఎన్నో రకాల మాడళ్లను విక్రయిస్తున్నది. నెక్సాన్, టియాగో, టిగోర్ రకాల్లో ఈవీలను అమ్ముతున్నది. హ్యుందాయ్, మహీంద్రా, కియా తదితర సంస్థలూ ఈ రేసులో పోటీపడుతున్నాయి. బీఎండబ్ల్యూ, ఆడీ, బెంజ్ వంటి లగ్జరీ సంస్థలూ ఈవీలను మార్కెట్లోకి తెస్తుండటం విశేషం.