న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. వచ్చే నెల నుంచి మారుతి సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఆడీ వాహనాల ధరలు 3 శాతం వరకు ప్రియం కానున్నాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఆయా మోడల్స్లో కొత్తగా తెస్తున్న ఫీచర్ల నేపథ్యంలో జనవరి 1 నుంచి ధరల్ని పెంచుతున్నట్లు గురువారం దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతితోపాటు లగ్జరీ కార్ బ్రాండ్లు బెంజ్, ఆడీ ప్రకటించాయి.
వివిధ రకాల మోడల్స్నుబట్టి ధరల పెరుగుదల ఉంటుందని మారుతి ఈ సందర్భంగా తెలిపింది. కాగా, ఇప్పటికే ఈ ఏడాదిలో మూడుసార్లు కార్ల ధరలను పెంచిన మారుతి.. మొత్తంగా 4.9 శాతం మేర కస్టమర్లపై భారం మోపింది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్లో 1.6 శాతం, సెప్టెంబర్లో 1.9 శాతం చొప్పున పెంచింది. ఆల్టో దగ్గర్నుంచి ఎస్యూవీ ఎస్-క్రాస్దాకా ఉన్న మారుతి మోడల్స్లో కనిష్ఠ ధర రూ.3.15 లక్షలు, గరిష్ఠ ధర రూ.12.56 లక్షలుగా ఉన్నది. ఉక్కు, అల్యూమినియం, కాపర్, ప్లాస్టిక్ ఇతర విలువైన లోహాల ధరలు గడిచిన ఏడాది కాలం నుంచి పెరుగుతున్నాయన్నది. ఈ క్రమంలోనే సంస్థ కొంత భారాన్ని మోస్తున్నా.. కొంత కస్టమర్లపై వేయక తప్పడం లేదని మారుతి మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు.
2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలియజేసింది. ఆడీ సైతం తమ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరిగిన తయారీ ఖర్చులు, నిర్వహణపరమైన వ్యయం వల్లే ధరల పెంపు అని వివరించింది. గత ఏడాది కాలంగా ఉత్పాదక వ్యయం పెరుగుతూనే ఉన్నదని ఇరు సంస్థలు గుర్తుచేశాయి. అందుకే ఇప్పుడు కొంత మేరకు ధరల్ని పెంచక తప్పట్లేదని పేర్కొన్నాయి.