న్యూఢిల్లీ: మొండి బకాయిలను వసూళ్ల కోసం త్వరలో ఏర్పాటు కానున్న బ్యాడ్ బ్యాంక్ (నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్-ఎన్ఏఆర్సీఎల్)లో మెజారిటీ వాటా ప్రభుత్వ రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్దే. ఆర్బీఐ తాజాగా సవరించిన పెట్టుబడి నిబంధనలకు అనుగుణంగా 12 శాతం వాటాలను తీసుకోనున్నది.
బ్యాడ్ బ్యాంకులో ప్రభుత్వ రంగ బ్యాంకులదే పైచేయిగా ఉంటుందని భావిస్తున్నారు. కెనరా బ్యాంకు మినహా మిగతా ఈక్విటీ ఇన్వెస్టర్లు 10 శాతం లోపు పెట్టుబడి వాటా కలిగి ఉంటారు.
ప్రారంభ ప్రణాళిక ప్రకారం బ్యాడ్ బ్యాంకులో 11 మంది వాటాదారులు 9 శాతానికి పైగా వాటా కలిగి ఉంటారు. ఇప్పటివరకు ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఇందులో వాటాల కొనుగోలను ధ్రువీకరించాయి.
బ్యాడ్ బ్యాంక్ స్పాన్సరర్గా ప్రభుత్వ బ్యాంకు ఉంటుందని కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేబాశిష్ ముఖర్జీ వెల్లడించారు. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు కూడా 10 % లోపు వాటాలను కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నాయి.
వాటాల స్వీకరణపై రెండు ప్రభుత్వ రంగ బ్యాంకేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) తేల్చుకోలేదు. ఈ వారంలో రిజిస్టార్ వద్ద ఎన్ఎఆర్సీఎల్ పేరు నమోదు, దానికి ఆర్బీఐ ఆమోదం వెన్వెంటనే జరుగనున్నాయి.