Budget 2023-24 | బీమా పాలసీలపై భారతీయులకు అవేర్ నెస్ తక్కువ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వంటి సంస్థ కూడా దేశవ్యాప్తంగా విస్తరించలేకపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత బీమా.. హెల్త్ బీమా గురించి ఇండియన్లలో కొంత అవగాహన పెరిగింది. అందుకే గతేడాది బీమా పాలసీల కొనుగోళ్లలో కొంత పురోగతి నమోదైంది. ఇన్సూరెన్స్ రంగంలో ఇన్వెస్ట్ మెంట్స్ కూడా పెరిగాయి. బీమా రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, క్లెయిమ్ ఆటోమేషన్ వంటి అంశాలు బీమా రంగంలో పారదర్శకతను గణనీయంగా పెంపొందిస్తాయి. బీమా సెక్టార్ స్థితిగతులను మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సర (2023-24) బడ్జెట్లో రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని బీమా పరిశ్రమ ఆశిస్తున్నది. ప్రత్యేకించి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ రేట్ తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను అభ్యర్థిస్తున్నది.
ప్రతియేటా వేతన జీవులు సమర్పించే ఐటీ రిటర్న్స్లో మినహాయింపులు క్లయిమ్ చేయొచ్చు. బీమా రంగం, జాతీయ పొదుపు పథకాల్లో పెట్టుబడులపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ఇచ్చే రాయితీలు పెంచాలన్న అభ్యర్థనలు వస్తున్నాయి. ఇప్పుడు రూ.1.5 లక్షల పెట్టుబడులపై ఆదాయం పన్ను శాఖ.. 80సీ సెక్షన్ కింద రాయితీ కల్పిస్తున్నది. 2014-15లో రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు ఈ రాయితీ పెంచింది కేంద్రం.
ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ రంగం విస్తరించలేదు. ఈ నేపథ్యంలో బీమా పాలసీల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఐటీ రిటర్న్స్లో బీమా పాలసీలపై పన్ను మినహాయింపులను పెంచాలని పలువురు కోరుతున్నారు. దీనివల్ల దేశ ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పనతోపాటు ఇన్సూరెన్స్ సెక్టార్ విస్తరించడానికి దోహద పడుతుందని అంటున్నారు.
సుమారు 30 శాతం మంది పౌరులకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ భద్రత లేదని 2021లో నీతి ఆయోగ్ వెల్లడించింది. కేవలం వైద్య ఖర్చుల వల్లే ఏటా ఏడు శాతం మంది పేదరికంలోకి వెళ్లిపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తున్నది. కనుక కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా వైద్య ఖర్చుల నుంచి రక్షణ కల్పించడానికి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేలా సర్కార్ ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద పన్ను రాయితీ ఇస్తున్నది. కొవిడ్-19 మహమ్మారి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కాస్ట్ లీగా మారాయి. ఈ పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కింద రూ.లక్ష వరకు రాయితీ కల్పించాలన్న అభ్యర్థనలు వెలువడుతున్నాయి.
ఇప్పుడు మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వా నిలకడగా పెన్షన్ అందించే కొలువులు తక్కువ. కనుక ఉద్యోగ సమయంలోనే పలు పెన్షన్ స్కీమ్ల్లో పెట్టుబడులు పెట్టాలి. రిటైర్మెంట్ తర్వాత ఆయా పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంతో జీవనం సాగించాల్సి ఉంటుంది. అంతే కాదు.. ఇప్పుడు పెన్షన్-యాన్యుటీ పేమెంట్స్ టాక్స్ పరిధిలోకి వస్తాయి. జీవిత బీమా సంస్థల పెన్షన్ పథకాలపై ఆదాయం పన్ను చట్టం 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. కానీ వీటికి స్పెషల్ రాయితీలు ఏమీ లేవు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టుబడులపై 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద రూ.50 వేల వరకు స్పెషల్ డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. ఇలాంటి రాయితీలు జీవిత బీమా సంస్థలిచ్చే పెన్షన్ పథకాలకూ ఇవ్వాలని పెన్షనర్లు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
కొవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రయాణ బీమాపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగింది. కనుక ట్రావెల్ ఇన్సూరెన్స్ మీద వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఎల్టీఏ రాయితీ తేవాలని వివిధ వర్గాలు కోరుతున్నాయి. రాయితీ పెంచితే అత్యధికలు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి.