EPFO-Higher Pension | ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే పెన్షన్.. వారి జీవనానికి కీలకంగా మారుతున్నది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో అధిక పెన్షన్ లెక్క కట్టి మంజూరు చేయడం వల్ల తీవ్ర ఆర్థిక భారం వల్ల ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) మనుగడ సాగించడమే ప్రశార్థకంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈపీఎస్ నిల్వలపై భవిష్యత్లో ప్రతికూల ప్రభావం పడకుండా, ఉద్యోగులకు సామాజిక న్యాయం దక్కేలా నూతన పెన్షన్ లెక్కింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చే విషయమై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కసరత్తు చేస్తున్నది. కొత్త పద్దతి ప్రకారం ఉద్యోగులకు లభించే అధిక పెన్షన్ కనీసం నాలుగో వంతు తగ్గుతుందని అంచనా.
అధిక పెన్షన్ అర్హత గల ఉద్యోగుల పెన్షన్ అర్హత వేతనంపై వారం క్రితం ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. దీని ప్రకారం 2014 సెప్టెంబర్ కంటే ముందు రిటైరైన వ్యక్తికి చివరి 12 నెలల వేతన సగటును పెన్షన్ అర్హమైన వేతనంగానూ, తర్వాత రిటైరైతే ఐదేండ్ల వేతన సగటును ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపింది.ఇప్పుడు పెన్షన్ అర్హత వేతనం x సర్వీస్ కాలం / 70గా పెన్షన్ లెక్క గడుతున్నారు. గరిష్ట వేతన పరిమితి దాటి అధిక పెన్షన్కు అర్హత పొందే వారికి స్పెషల్ ఫార్ములా అమలు చేయాలన్న అభిప్రాయం కూడా ఉంది. అధిక పెన్షన్కు ఉమ్మడి ఆప్షన్ తీసుకున్నప్పుడే తాము నిర్ణయించే పెన్షన్ లెక్కింపు సూత్రానికి కట్టుబడి ఉండాలన్న షరతు విధించింది ఈపీఎఫ్ఓ. ఆ షరతు ఆధారంగానే దరఖాస్తులు స్వీకరించింది.
దీంతో పెన్షన్ లెక్కింపు సూత్రం ఖరారు చేయడానికి జరిగిన చర్చలు రెండు విషయాలు తెర మీదకు వచ్చాయి. ఉద్యోగి సర్వీసు సగటు వేతనం పెన్షన్కు అర్హతగా నిర్ణయించాలన్న చర్చ జరిగినా. అధిక నిబంధనలకు విరుద్ధం అని, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఈపీఎఫ్ఓ వెనక్కి తగ్గింది. అలా కాకుండా పెన్షన్ అర్హత వేతనాన్ని సర్వీసు కాలంతో లెక్క గట్టి, దాన్ని 90తో బాగించే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నది. దీనివల్ల ఈపీఎఫ్పై భారం తగ్గడంతోపాటు ఉద్యోగులకు సామాజిక న్యాయం అందించవచ్చునని ఈపీఎఫ్ఓ భావిస్తున్నది.