Union Cabinet Decisions | రైతుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకున్నది. రైతుల ఆదాయం పెంచడంతోపాటు మధ్య తరగతి ప్రజలకు ఆహార భద్రత కొనసాగించేందుకు నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో సుస్థిర వ్యవసాయం, రైతుల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కొత్తగా పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎం-ఆర్కేవీవై), కృషి ఉన్నతి యోజన పథకాలకు గురువారం ఆమోదం తెలిపారు. దేశ ప్రజలందరికీ ఆహార భద్రత సాధనలో స్వయం సమృద్ధి కోసం ఈ పథకాల కింద రూ.1,01,321 కోట్లు ఖర్చు చేయనున్నది.
ఆత్మ నిర్బర్ పథకం కింద దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే ఏడేండ్ల (2024-25 నుంచి 2030-31) కాలంలో రూ.10,103 కోట్లు ఖర్చు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. శరవేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న చెన్నై నగరానికి రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. రూ.63,246 కోట్ల అంచనా వ్యయంతో మూడు కారిడార్ల పరిధిలో 119 కి.మీ పొడవునా మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తితో నిధులు కేటాయిస్తాయి. మహారాష్ట్రలో మరాఠీ, పాలి, ప్రకృత్, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.
రైల్వేశాఖలోని వివిధ విభాగాల్లో పని చేసే 11,72,240 మంది ఉద్యోగులకు 78 రోజుల వేతనంతో కూడిన బోనస్ ప్రకటించింది. రూ.2,029 కోట్ల విలువైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) ప్రకటించింది. దేశంలోని ప్రధాన నౌకాశ్రయాలు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికులకు 2020-21 నుంచి 2025-26 మధ్య ప్రొడక్టివిటీ లింక్డ్ రివార్డ్ స్కీం కు ఆమోదం తెలిపింది. 20,704 మంది ఉద్యోగులు, కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తారు.