LIC IPO | త్వరలో ప్రారంభమయ్యే భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు తలుపులు తెరుచుకున్నాయి. ఎల్ఐసీ ఐపీవోలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 20 శాతం వరకు ఆటోమేటిక్ రూట్లో మదుపు చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లను తాకనున్న ఐపీవోలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ద్వారాలు తెరిచినట్లయింది.
ప్రస్తుతం అమలులో ఉన్న ఎఫ్డీఐ విధానానికి స్వల్ప సవరణలు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. సులభంగా, ఎఫ్డీఐ ఫ్రేమ్వర్క్ను అర్థం చేసుకునేలా నిబంధనలు సవరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రోత్సహించేందుకు ఎఫ్డీఐ పాలసీలో సంస్కరణలు తోడ్పాటునిస్తాయన్నారు. తద్వారా భారీగా ఎఫ్డీఐ నిధుల రాకతో పెట్టుబడులు, ఆదాయం, ఉద్యోగాల్లో వృద్ధి నమోదవతుందని ఆ అధికారి కథనం.
1956 ఎల్ఐసీ చట్టం ప్రకారం.. ఈ సంస్థలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు ప్రస్తుత ఎఫ్డీఐ పాలసీ అనుమతించదు. బీమా రంగ సంస్థల్లోకి మాత్రమే ఎఫ్డీఐ నిధులను అనుమతిస్తారు. కానీ ఎల్ఐసీ ఒక చట్టబద్ధమైన కార్పొరేషన్. 1956 ఎల్ఐసీ యాక్ట్ ప్రకారం ఈ కార్పొరేషన్ ఏర్పాటైంది. 1956 ఎల్ఐసీ యాక్ట్తోపాటు 1938 ఇన్సూరెన్స్ యాక్ట్, 1999 ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం ఎల్ఐసీలోకి నేరుగా విదేశీ పెట్టుబడులను అనుమతించరు.
ప్రస్తుత ఎఫ్డీఐ పాలసీ ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 20 శాతం ఎఫ్డీఐలను అనుమతించారు. ఇతర కార్పొరేట్ సంస్థల మాదిరిగానే ఎల్ఐసీలోకి 20 శాతం ఎఫ్డీఐలను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఐపీవో ద్వారా ఐదు శాతం వాటాల విక్రయానికి అనుమతించాలని ఈ నెల 13న ఎల్ఐసీ సెబీకి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఐపీవో ద్వారా రూ.63 వేల కోట్ల నిధులు సేకరించాలని కేంద్రం లక్ష్యం.