Byju’s |ఒకప్పుడు భారత్లో పేరొందిన ఎడ్-టెక్ స్టార్టప్ ‘బైజూ’స్.. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. రుణాలను క్లియర్ చేసేందుకు కీలక విభాగాలను విక్రయించ తలపెట్టిన ‘బైజూ’స్ యాజమాన్యంపై ఆ సంస్థ రుణ దాతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బైజూస్ ఉద్దేశ పూర్వకంగా 544 మిలియన్ల డాలర్ల నిధులు ఒక హెడ్జ్ ఫండ్లో రహస్యంగా దాచి పెట్టిందని ఆరోపించారు. రుణ ఎగవేతకు పాల్పడితే.. సదరు నిధులు రికవరీ చేసుకోకుండా నిలువరించడానికే బైజూస్ ఈ పని చేసిందని రుణ దాతలు చెప్పినట్లు బ్లూంబర్గ్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
రుణ దాతల ఆరోపణలపై బైజూస్ వివరణ ఇచ్చింది. తాము రుణం ద్వారా తీసుకున్న నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టొద్దన్న నిబంధన తమ లోన్ కండీషన్లలో లేదని స్పష్టం చేసింది. తమ వద్ద తీసుకున్న రుణాలను అమెరికాలోని బైజూ’స్ అనుబంధ ‘ఆల్ఫా’ అనే సంస్థ.. క్యామ్షాఫ్ట్ ఫండ్లోకి ట్రాన్స్ ఫర్ చేసిందని అమెరికాలో రుణ దాతలు పిటిషన్ దాఖలు చేశారు.
2021లో అమెరికాలోని రుణదాతల కన్సార్టియం నుంచి బైజూ’స్.. 120 కోట్ల డాలర్ల టర్మ్ లోన్ తీసుకున్నది. ఈ రుణానికి సంబంధించి బైజూ’స్ గత జూన్ నెలలో 40 మిలియన్ డాలర్ల వడ్డీ చెల్లింపులు జరుపలేదు. నాటి నుంచి రుణాల చెల్లింపు విషయమై రుణదాతలతో సంప్రదింపులు చేస్తున్నది. ఈ రుణాల చెల్లింపునకు తమ సంస్థలో కీలకమైన ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ విభాగాలను విక్రయించాలని ప్రయత్నిస్తున్నది.