Byju’s-ED | ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎడ్ టెక్ స్టార్టప్ ‘బైజూ’స్కు మరో షాక్ తగిలింది. ఫారెక్స్ నిబంధనలను ఉల్లంఘించారంటూ బైజూ’స్ యాజమాన్యానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై గత మే నెలలో బైజూ’స్ ఫౌండర్ కం సీఈఓ బైజూ రవీంద్రన్, ఆయన కంపెనీ ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’ తోపాటు మూడు చోట్ల ఈడీ తనిఖీలు జరిపిన సంగతి తెలిసిందే. తమ దర్యాప్తు నివేదిక ప్రకారమే బైజూ రవీంద్రన్, ఆయన కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకూ నోటీసులు పంపామని ఈడీ తెలిపింది. రూ.9,000 కోట్ల మేరకు బైజూ’స్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఈడీ అభియోగం. కానీ తాము ఎటువంటి ఫెమా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని బైజూ’స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈడీ నుంచి తమకు ఎటువంటి నోటీసులు అందలేదని పేర్కొంది.
2011-23 మధ్య సుమారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఎస్) కింద బైజూ’స్ సుమారు రూ.28 వేల కోట్ల నిధులు పొందిందని తమ తనిఖీల్లో తేలినట్లు ఈడీ తెలిపింది. మరోవైపు విదేశాల్లో పెట్టుబడుల పేరిట రూ.9,754 కోట్లు, విదేశాల్లో పెట్టుబడుల విషయమై అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ ఖర్చుల నిమిత్తం సుమారు రూ.944 కోట్లు ఖర్చు చేసినట్లు ఈడీ ఆరోపిస్తున్నది.
2020-21 నుంచి బైజూ’స్ ఫైనాన్సియల్ స్టేట్మెంట్లు తయారు చేయలేదని, సంస్థ ఖాతాలు అడిటింగ్ చేయలేదని ఈడీ అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో బైజూ’స్ వెల్లడించే గణాంకాల్లో వాస్తవికతను తెలుసుకునేందుకు బ్యాంకు అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తామని ఈడీ అధికారులు చెప్పారు. పలువురు ప్రయివేట్ వ్యక్తుల ఫిర్యాదుల మేరకు తమ దర్యాప్తు ప్రారంభించామని ఈడీ తెలిపింది.