Byju’s | ఇండియన్ ఎడ్-టెక్ స్టార్టప్ బైజూస్ మరింత పొదుపు చర్యలు చేపట్టనున్నది. ఇంతకుముందు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన బైజూస్.. తాజాగా రెండో దశలో మరికొంత మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపేందుకు సిద్ధమైంది. రుణదాతల నుంచి ఒత్తిళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో బైజూస్.. ఉద్యోగాల కోతకు దిగనుండటం గమనార్హం. వివిధ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను సాగనంపనున్నదని తెలుస్తున్నది.
బైజూస్ హెచ్ఆర్ విభాగం.. ఉద్యోగులతో విడివిడిగా సమావేశమై ఉద్యోగాల కోత గురించి చర్చించినట్లు వనికిడి. ఈ నెల 14 నుంచే లే-ఆఫ్స్ ప్రారంభం అయ్యాయని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. ఈ చర్చల తర్వాత ఉద్యోగులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసే ఆప్షన్ ఇచ్చినట్లు సమాచారం. అలా స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉద్యోగుల ఈ-మెయిల్స్ డీయాక్టివేట్ చేయడంతోపాటు వారి అధికారిక గుర్తింపు కార్డులను అప్పగించాలని హెచ్ఆర్ విభాగం కోరినట్లు తెలియవచ్చింది. మానిటరింగ్, లాజిస్టిక్స్, ట్రైనింగ్, సేల్స్, పోస్ట్ సేల్స్, ఫైనాన్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని సమాచారం. రెండేండ్లకు పైగా పని చేస్తున్న సీనియర్లను తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు జూన్, జూలై వేతనం ఇవ్వడానికి బైజూస్ యాజమాన్యం ప్రణాళిక వేసినట్లు సమాచారం. సెప్టెంబర్, అక్టోబర్లలో ఫైనల్ సెటిల్మెంట్ చేయనున్నట్లు తెలిసింది. 2,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించినా బైజూస్ యాజమాన్యం.. లాభాల బాటలోకి సంస్థను నడిపించడంలో విఫలమైంది. సంస్థలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. 40 మిలియన్ డాలర్ల రుణంపై వడ్డీ చెల్లించలేక డీఫాల్ట్ కావడంతో బైజూస్లో లే-ఆఫ్స్ మొదలయ్యాయని తెలిసింది. బైజూస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా రుణ దాతలు కేసు నమోదు చేయడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.