హైదరాబాద్, జూలై 14 (బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్), చైనాకు చెందిన ప్రముఖ ఆటో రంగ సంస్థ బీవైడీ కలిసి రాష్ట్రంలో విద్యుత్తు ఆధారిత వాహనాలు (ఈవీ), బ్యాటరీ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాయి. రూ. 8,000 కోట్లకుపైగా (1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులతో ఈ ఉత్పాదక కేంద్రాలను ఇరు సంస్థలు తీసుకురానుండగా.. ఇందుకోసం అనుమతిని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వద్దకు ఈ ప్రతిపాదనను పంపించాయి. ఈ మేరకు శుక్రవారం సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తున్నది.
కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే ప్లాంట్ పనులు మొదలవుతాయని సదరు వర్గాలు పీటీఐకి తెలియజేశాయి. దీంతో భారీగా ఉపాధి-ఉద్యోగావకాశాలూ రానున్నాయి. కాగా, ఒలెక్ట్రా బ్రాండ్తో ఎలక్ట్రిక్ బస్సులను మెయిల్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఒలెక్ట్రాకు టెక్నాలజీ భాగస్వామిగా బీవైడీ వ్యవహరిస్తున్న సంగతీ విదితమే. ఈ నేపథ్యంలోనే వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10వేల బస్సులకు తీసుకెళ్లాలని మెయిల్ చూస్తున్నది. అంతేగాక టిప్పర్లు, ట్రక్కులు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, త్రిచక్ర-ద్విచక్ర వాహనాలుసహా ఇతర ఈవీ ఉత్పత్తులను తయారు చేసే యోచనలో కూడా మెయిల్ ఉన్నది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం కంపెనీకి 150 ఎకరాల భూమిని కేటాయించినది తెలిసిందే. ఈ క్రమంలో బీవైడీతో కలిసి ఈవీ, బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు మెయిల్ ప్రయత్నాలు చేస్తుండగా, ఇవి ఓ కొలిక్కి వస్తే మరింత భూ కేటాయింపులు, ఇతరత్రా అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయా కంపెనీల ప్రతినిధులు సంప్రదిస్తారని చెప్తున్నారు.