Online Shopping | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఆన్లైన్ మార్కెట్లో రాబోయే పండుగ సీజన్ అమ్మకాలు ఈ ఏడాది రూ.90,000 కోట్లను తాకవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే 18-20 శాతం పెరుగవచ్చని మార్కెట్ రిసెర్చ్ కంపెనీ రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంటున్నది. ‘2023 పండుగ సీజన్లో భారతీయ ఈ-కామర్స్ మార్కెట్ గ్రాస్ మార్చైండైజ్ వాల్యూ (జీఎంవీ) దాదాపు రూ.90,000 కోట్లుగా నమోదు కావచ్చు. 2022 పండుగ సీజన్ జీఎంవీతో పోల్చితే 18-20 శాతం వృద్ధి ఉంటుందని మా అంచనా’ అని రెడ్సీర్ పేర్కొన్నది. ఈ క్రమంలోనే రాబోయే పండుగ సీజన్లో సుమారు 14 కోట్ల ఆన్లైన్ షాపర్స్ ఒక్కసారైనా లావాదేవీ జరుపుతారన్నది.
ఈ ఏడాది భారతీయ ఈ-కామర్స్ ఇండస్ట్రీ జీఎంవీ దాదాపు రూ.5.25 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. 2014లో ఇది కేవలం రూ.27,000 కోట్లే. ఈ పదేండ్లలో సుమారు 20 రెట్లు పెరుగుదల కనిపిస్తుండటం గమనార్హం. అలాగే వార్షిక లావాదేవీల్లోనూ దాదాపు 15 రెట్లు వృద్ధి ఉంటున్నట్టు రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ పార్ట్నర్ మ్రిగంక్ గుట్గుటియా చెప్తున్నారు. నిజానికి ఇప్పుడంతా ఆన్లైన్ మార్కెట్లోనే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడోగానీ సంప్రదాయ మార్కెట్లో కొనుగోళ్లపై మక్కువ చూపట్లేదు. దీంతో సహజంగానే ఆన్లైన్ మార్కెట్కు ఆదరణ అంతకంతకూ పెరుగుతూపోతున్నది.
పండుగ సీజన్ ఆన్లైన్ అమ్మకాల్లో ఎలక్ట్రానిక్స్దే హవా. గడిచిన కొన్నేండ్లుగా నమోదైన గణాంకాలను చూస్తే ఇదే స్పష్టంగా తెలుస్తున్నది. చాలామంది స్మార్ట్ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలకూ గిరాకీ కనిపిస్తున్నది. అలాగే ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్, దుస్తులు, పాదరక్షలతోపాటు మిక్సర్ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్ల వంటి ఇతరత్రా గృహోపకరణాలకూ డిమాండ్ ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లకూ ఆదరణ పెరుగుతున్నట్టు పేర్కొంటున్నాయి.