లక్నో : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) అలహాబాద్ విద్యార్ధికి రూ 1.4 కోట్ల వార్షిక వేతన ప్యాకేజ్తో గూగుల్లో జాబ్ ఆఫర్ లభించింది. నెలకు దాదాపు రూ 11.6 లక్షల వేతనంతో ప్రతం ప్రకాష్ గుప్తాకు టెక్ దిగ్గజం నుంచి బంపర్ ఆఫర్ దక్కింది. ఐఐఐటీ అలహాబాద్ ఎంటెక్ బ్యాచ్కు చెందిన పలువురికి టాప్ టెక్ కంపెనీల్లో రూ కోట్ల విలువైన ప్యాకేజ్లతో కొలువులు దక్కాయి. 2022 ఎంటెక్ బ్యాచ్ నూరు శాతం ప్లేస్మెంట్ మార్క్ను సాధించిందని ఐఐఐటీ అలహాబాద్ పేర్కొంది.
భారీ వేతన ప్యాకేజ్తో ప్రకాష్ గుప్తా గూగుల్ లండన్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ ఆఫర్ అందుకున్నాడు. టెక్ దిగ్గజం నుంచి వచ్చిన బంపర్ ఆఫర్ గురించి గుప్తా తన లింక్డిన్ ఖాతాలో పొందుపరిచాడు. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల నుంచి తనకు అద్భుత ఆఫర్లు వచ్చాయని, గూగుల్ ఆఫర్ను తాను స్వీకరించినట్టు మీతో పంచుకుంటున్నానని గుప్తా లింక్డిన్లో రాసుకొచ్చాడు. ఈ ఏడాది తన గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే గూగుల్ లండన్ ఆఫీస్లో చేరతానని ఆ పోస్ట్లో గుప్తా చెప్పాడు.
తన కెరీర్ పట్ల తాను ఎగ్జైటింగ్గా ఉన్నానని అన్నాడు. ఐఐఐటీ అలహాబాద్ ఎంటెక్ బ్యాచ్లో ఈ ఏడాది ఐదుగురు విద్యార్ధులకు రూ కోట్లలో వేతన ప్యాకేజ్లు లభించాయని సంస్ధ పేర్కొంది. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, యాపిల్, నెట్ఫ్లిక్స్ వంటి దిగ్గజ కంపెనీల నుంచి వీరికి ఆఫర్లు వచ్చాయని ఐఐఐటీ అలహాబాద్ తెలిపింది. 48 శాతం బీటెక్ విద్యార్ధులకు ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఆఫర్లు దక్కాయని వెల్లడించింది. ఇక అలహాబాద్ ఐఐఐటీ ఎంటెక్ బ్యాచ్కు నూరు శాతం ప్లేస్మెంట్ లభించడం ఇదే తొలిసారి.