UBS | ముంబై, జూన్ 10: వరుసగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరినా.. ఈ ఐదేండ్లు మాత్రం అంత ఈజీ కాదని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ అంటున్నది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాల మద్దతుతో అధికారాన్ని చేపట్టిన ప్రధాన మంత్రి మోదీకి.. కీలక సంస్కరణలపై నిర్ణయం సవాలేనని సోమవారం వ్యాఖ్యానించింది. 2014, 2019లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ.. ఈసారి సంకీర్ణ ప్రభుత్వంలో భాగం కావాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భూములు, వ్యవసాయం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, యూనిఫామ్ సివిల్ కోడ్, ఒకే దేశం-ఒకే ఎన్నికలు వంటి ప్రధాన సంస్కరణల్ని అమల్లోకి తేవాలంటే ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల అంగీకారం తప్పనిసరిగా ఉండాలని యూబీఎస్ గుర్తుచేస్తున్నది. ఒకవేళ ఈ సంస్కరణలు అమలైతే తయారీ తదితర కీలక రంగాలు పరుగులు పెట్టి దేశ ఆర్థిక వృద్ధిరేటు వచ్చే ఐదేండ్లలో 7.5 శాతానికిపైనే ఉండొచ్చని యూబీఎస్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని యూబీఎస్ చీఫ్ ఎకనామిస్ట్ జైన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే వచ్చే ఏడాది రెపో రేటు అర శాతం (0.50 శాతం) తగ్గేందుకు వీలున్నదని చెప్పారు. కాగా, ఇప్పటికే దేశంలో సంస్కరణల అమలు అంశంపై అటు ఫిచ్ రేటింగ్స్, ఇటు మూడీస్ స్పందించిన విషయం తెలిసిందే. ‘ఈసారి బీజేపీకి తగ్గిన మెజారిటీ.. పాలనాపరమైన సవాళ్లకు, ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల అమలుకు బ్రేక్ వేస్తుందనిపిస్తున్నది’ అని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే ‘పార్లమెంట్లో ఈసారి బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. దీనివల్ల ఆర్థిక సంస్కరణల అమలు ఆలస్యం కావచ్చు. ఇది ఆర్థిక క్రమశిక్షణనూ దెబ్బతీసేలా ఉన్నది’ అని మూడీస్ అభిప్రాయపడింది.