BPCL | దేశీయంగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పుంజుకుంటున్నది. అందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ మౌలిక వసతుల కల్పనలో ముందడుగు వేసేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సిద్ధమైంది. త్వరలో దేశవ్యాప్తంగా 7,000 రిటైల్ పెట్రోల్ పంపులను ఈవీ చార్జింగ్ స్టేషన్లను మార్చేడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్కు చార్జింగ్ వసతుల కల్పనతోపాటు మల్టీఫుల్ ఫ్యుయలింగ్ ఆప్షన్లను వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. శుక్రవారం బెంగళూరు-చెన్నై, బెంగళూరు-మైసూర్-కూర్గ్ జాతీయ రహదారుల కారిడార్లపై ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను బీపీసీఎల్ ప్రారంభించింది. మధ్య కాలిక అవసరాల నుంచి దీర్ఘ కాలిక అవసరాల కోసం తమ పెట్రోల్ పంపులను ఈవీ చార్జింగ్ స్టేషన్లను మార్చాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రకటించింది.
బెంగళూరు-చెన్నై, బెంగళూరు-మైసూర్-కూర్గ్ జాతీయ రహదారుల కారిడార్ల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా వ్యూహాత్మక ప్రాంతాల్లోని తొమ్మిది పెట్రోల్ పంపుల పరిధిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నది. రెండు చార్జింగ్ స్టేషన్ల మధ్య 100 కి.మీ. దూరం ఉంటుందని బీపీసీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్ధిష్ట గడువు లోగా దేశంలోని ప్రధాన నగరాలు, ఎకనమిక్ సెంటర్లను కలుపుతూ అన్ని ప్రధాన జాతీయ రహదారుల పరిధిలో గల పెట్రోల్ పంపులను చార్జింగ్ స్టేషన్లుగా మార్చాలని బీపీసీఎల్ ప్రణాళికలు రచించింది.
వచ్చే ఎనిమిదేండ్లలో భారత్ రోడ్లపైకి ఐదు కోట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ రానున్నాయి. వాటిల్లో టూ వీలర్స్ సుమారు 70 శాతం ఉంటాయి. కానీ, పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి అనుగుణంగా చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందుబాటులో ఉండాలి. దేశవ్యాప్తంగా 20.5 లక్షల చార్జింగ్ స్టేషన్లు అవసరం అని ఓ సర్వేలో తేలింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)కి అవసరమైన చార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 32 ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఒక చార్జింగ్ స్టేషన్ మాత్రమే ఉన్నాయి.