హైదరాబాద్, డిసెంబర్ 13: హైదరాబాద్లోని బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వచ్చే రెండు, మూడేండ్లలో సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని యోచిస్తున్నది. నగరంలో కొత్త సదుపాయంలోకి మారుతున్న కంపెనీ ఫ్రెషర్లను, నిపుణులను నియమించుకుని, సిబ్బంది సంఖ్యను 3,000కు పెంచాలని భావిస్తున్నది. రెండు దశల్లో కొత్త సదుపాయాన్ని విస్తరిస్తున్నామని, తొలిదశలో నాలుగు ఫ్లోర్లు సిద్దమయ్యాయని, రెండోదశలో భాగంగా వచ్చే ఆరు నెలల్లో 2-3 ఫ్లోర్లను పూర్తిచేస్తామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్ సెంటర్ హెడ్ కిరణ్ సుందర రామన్ తెలిపారు. విస్తరణ తర్వాత ఈ సెంటర్ సీటింగ్ కెపాసిటీ 2,200కు చేరుతుందని, తమ ఉద్యోగులు హైబ్రీడ్ మోడల్లో (కొంతమంది ఇంటినుంచి, మరికొంత మంది ఆఫీసు నుంచి) పనిచేస్తున్నందున, 3,000 మందికి ఈ సదుపాయం సరిపోతుందని తెలిపారు.బాష్కు హైదరాబాద్తో పాటు బెంగళూరు, కోయంబత్తూరు, పూనేల్లో ఉన్న కార్యాలయాల్లో 28,000 మంది పనిచేస్తున్నారు.