ముంబై, ఫిబ్రవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన టీసీఎస్, టాటా మోటర్స్, సన్ఫార్మా షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలు దూసుకుపోవడానికి దోహదపడ్డాయి.
మధ్యాహ్నాం వరకు తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలకు గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ముగియడం కలిసొచ్చింది. దీంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 305.90 పాయింట్లు ఎగబాకి తిరిగి 73 వేల పైకి చేరుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి 73,095.22 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 76.30 పాయింట్లు అందుకొని 22,198.35 వద్ద నిలిచింది.
టాటా మోటర్స్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగియగా..మరోవైపు, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీలు నష్టపోయాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు గురువారం గడువు ముగియనుండటంతో మదుపరులు వేచి చూసే దోరణి అవలంభించినప్పటికీ..చివర్లో మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు, ఫలితంగా తిరిగి లాభాల్లోకి వచ్చాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఇండెక్స్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ 1.02 శాతం లాభపడగా..కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.01 శాతం, టెక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ రంగ షేర్లు లాభాల్లో ముగియగా..కమోడిటీ, ఆర్థిక సేవలు, టెలి కమ్యూనికేషన్, యుటిలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. యూరోపియన్ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి రావడం కలిసొచ్చింది.
నష్టపోయిన రూపాయి
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా నష్టపోయింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక్క పైసలు క్షీణించి 82.89కి జారుకున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం, డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.