ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లపై బేర్ పట్టు కొనసాగడంతో మార్కెట్లు విలవిల్లాడాయి. చిన్న, మధ్యతరహా, లార్జ్ క్యాప్ అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లో షేర్లు భారీగా నష్టపోయాయి. ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు, ఒమిక్రాన్ విజృంభణ, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు తప్పదనే సంకేతాలు దేశీయ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతిశాయి. దాంతో దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదయ్యింది.
ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంవల్ల అన్ని రంగాల షేర్లు నష్టాలనే చవిచూశాయి. సిప్లా, ఓఎన్జీసీ షేర్లు మాత్రమే లాభాలను ఆర్జించాయి. చివరకు, సెన్సెక్స్ 1546 పాయింట్లు కోల్పోయి 57,491కి పడిపోయింది. నిఫ్టీ 468 పాయింట్లు నష్టపోయి 17,149 వద్ద స్థిరపడింది. ఒక్క రోజులోనే సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 3 శాతం క్షీణించాయి. మదపర్ల సంపద సుమారు రూ.10 లక్షల కోట్లు ఆవిరయ్యింది.
నిఫ్టీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువగా నష్టపోతే.. సిప్లా, ఓఎన్జీసీ షేర్లు మాత్రమే లాభాలను ఆర్జించాయి. అన్ని ఆటో, మెటల్, ఐటీ, పవర్, ఫార్మా, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 2-6 శాతం పడిపోయి భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతం నష్టపోయాయి.