BOM | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణగ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహన, వ్యక్తిగత, గృహ రుణాలు మరింత ప్రియంకానున్నాయి. పెరిగిన వడ్డీరేట్లు అమలులోకి వచ్చాయి.
ఐదు నెలల క్రితం అక్టోబర్ 11, 2023లో వడ్డీరేట్లను సవరించిన బ్యాంక్..మళ్లీ ఇప్పుడు పెంచింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతం నుంచి 8.10 శాతానికి చేరుకోగా, నెలరోజుల రుణాలపై రేటు 8.20 శాతం నుంచి 8.30 శాతానికి, మూడు నెలల రుణాలపై రేటు 8.40 శాతానికి పెంచింది. అలాగే ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 8.50 శాతం నుంచి 8.60 శాతానికి సవరించిన బ్యాంక్..ఏడాది రుణాలపై రేటును 8.80 శాతానికి పెంచింది.