న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.3,313 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం పెరగడం వల్లనే అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,088 కోట్ల లాభంతో పోలిస్తే 59 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.20,270.74 కోట్లుగా ఉన్న ఆదాయం.. గత త్రైమాసికానికిగాను రూ.23,080.03 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 34.5 శాతం ఎగబాకి రూ.10,714 కోట్లకు చేరుకున్నది.
l బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.11 శాతం నుంచి 5.31 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏ కూడా 2.83 శాతం నుంచి 1.16 శాతానికి దిగొచ్చింది.
l మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,627.46 కోట్ల నిధులు వెచ్చించింది. నికర వడ్డీ మార్జిన్ 3.33 శాతం పెరిగాయి.
l కన్సాలిడేటెడ్ ఆధారంగా బ్యాంక్ నికర లాభం రూ.3,400 కోట్లుగా నమోదైంది. గతేడాది రూ.2,168 కోట్లుగా ఉన్నది.