న్యూఢిల్లీ, మే 8: బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బీవోబీ రూ.5,616 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,048 కోట్ల లాభంతో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదైంది. ఏడాది క్రితం రూ.35,852 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.36,609 కోట్లకు ఎగబాకింది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.32,642 కోట్లుగా ఉన్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.26 శాతం నుంచి 1.89 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ కూడా 0.58 శాతం నుంచి 0.45 శాతానికి తగ్గాయని పేర్కొంది.
బ్యాంక్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో స్వల్పంగా పెరిగి 93.94 శాతానికి చేరుకోగా, క్యాపిటల్ అడెక్వసీ రేషియో 17.19 శాతం నుంచి 15.82 శాతానికి తగ్గింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,42,750 కోట్ల ఆదాయంపై రూ.20,021 కోట్ల లాభాన్ని గడించింది. మరోవైపు, 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ రూ.8.5 డివిడెండ్(425 శాతం)ను బోర్డు ప్రతిపాదించింది. అలాగే టైర్-1, టైర్-2 బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.6 వేల కోట్ల నిధుల సేకరణకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.