BMS on Pension | రిటైర్డ్ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.1,000 నుంచి రూ.5,000లకు పెంచాలని ఆరెస్సెస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంగ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది. ఇందుకోసం గురువారం దేశవ్యాప్తంగా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) కార్యాలయ వద్ద ధర్నాలు చేసింది. ఉద్యోగుల చివరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈపీఎఫ్వో, ఈపీఎస్-95 పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈపీఎస్-95 పెన్షన్ అంశం సంఘటిత రంగంలో అతిపెద్ద సమస్యగా పరిణమించిందని పేర్కొంది. సంఘటిత రంగానికి చెందిన 65 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఈపీఎస్లో భాగస్వాములుగా ఉన్నారు. జీవిత కాలం పని చేసినా కరోనా వేళ కేవలం రూ.1,000 పెన్షన్ మాత్రమే పొంఉదుతన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈపీఎస్ కింద కనీస పెన్షన్గా రూ.1000 పొందుతున్న వారి ఫించన్ నెలకు రూ.5000లకు పెంచాలని బీఎంఎస్ కోరింది.
ఈపీఎస్-95 పెన్షనర్లకు ఆయుష్మాన్ భారత్ మెడికల్ స్కీం కింద వైద్య వసతులు కల్పించాలని కేంద్ర కార్మిక శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. తక్కువ పెన్షన్ మాత్రమే పొందుతుండటంతో వారు సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో చికిత్స పొందలేకపోతున్నారని బీఎంఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలను గత నెల 18న బడ్జెట్ సంప్రదింపుల కోసం జరిగిన జాతీయ కార్మిక సంఘాల భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్కు బీఎంఎస్ విజ్ఞప్తి చేసింది.