న్యూఢిల్లీ, మే 28: చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో తొలిసారి సమావేశమైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి.. ఊహించినట్లుగానే కరోనా వ్యాక్సిన్లపై పన్నుల జోలికి వెళ్లలేదు. అయితే ఈమధ్య బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోకి దిగుమతయ్యే దాని ఔషధాలపై మాత్రం సుంకం మినహాయింపునిచ్చింది. 7 నెలల విరామం అనంతరం శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 43వ జీఎస్టీ మండలి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నిజానికి మూడు నెలలకోసారి జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరగాల్సి ఉన్నది, కానీ, చివరిసారిగా గతేడాది అక్టోబర్లో భేటీ జరిగింది. ఇదిలావుంటే అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు తాజా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగిస్తున్న ఆంఫోటెరిసిన్-బీ దిగుమతులపై ఐజీఎస్టీ మినహాయింపునివ్వడంతో వీటి ధరలు తగ్గనున్నాయి.
వ్యాక్సిన్లపై పన్నెంత?
కొవిడ్-19 వ్యాక్సిన్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 5 శాతం జీఎస్టీని మినహాయించాలన్న దానిపై ఈ జీఎస్టీ మండలి సమవేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఓ మంత్రుల బృందం వ్యాక్సిన్లు, ఇతర మెడికల్ ఉత్పత్తుల సరఫరాపై పన్ను నిర్మాణం గురించి చర్చిస్తుందని భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిర్మల తెలిపారు. పది రోజుల్లోగా లేదా వచ్చే నెల 8కల్లా ఓ నివేదికను ఈ మంత్రుల బృందం సమర్పిస్తుందని తెలియజేశారు. అలాగే విదేశాల నుంచి దిగుమతయ్యే కరోనా సంబంధిత ఔషధాలపై అవసరమైతే అన్నింటికీ ఐజీఎస్టీ మినహాయింపును కల్పిస్తామన్న సంకేతాలనిచ్చారు.