ముంబై, జనవరి 24: అంతర్జాతీయ సంకేతాలు, ఇతర అంశాల ప్రభావంతో సోమవారం దేశీ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. గతవారం వరుసగా నాలుగురోజులు తగ్గుతూ వచ్చిన ఈక్విటీలను కనిష్ఠస్థాయిల్లో కూడా తాజాగా ఇన్వెస్టర్లు ఎడాపెడా విక్రయించారు.దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1,546 పాయింట్ల భారీ పతనాన్ని చవిచూసింది. గతేడాది నవంబర్ ఇంట్రేడేలో ఒక సందర్భంగా 2,000 పాయింట్ల వరకూ పతనమైన ఈ సూచి 57,000 స్థాయిని సైతం పరీక్షించింది. చివరి అరగంటలో జరిగిన షార్ట్ కవరింగ్తో నష్టాల నుంచి కొంతవరకూ కోలుకుని 57,492 పాయింట్ల వద్ద ముగిసింది. తాజాగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 468 పాయింట్లు తగ్గి, 17,149 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒకే రోజున ఇంత తీవ్ర పతనాన్ని చవిచూడటం గతేడాది సెప్టెంబర్ 26 తర్వాత ఇదే ప్రధమం. సెన్సెక్స్ వరుసగా ఐదు ట్రేడింగ్ రోజుల్లో 3,800 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ ఇదే సమయంలో 1,150 పాయింట్లకు పైగా కోల్పోయింది.
బ్లూచిప్ షేర్లలో భారీ అమ్మకాలు
సాధారణ మార్కెట్ పతనాల్లో కొద్దిపాటి ఒడిదుడుకులకు లోనయ్యే బ్లూచిప్ షేర్లను కూడా ఇన్వెస్టర్లు గట్టిగా విక్రయించారు. డిసెంబర్ క్వార్టర్కు భారీ లాభాల్ని ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం తాజాగా 4 శాతం పడిపోయింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 6 శాతం క్షీణించింది. బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ టెక్, టైటాన్లు 5 శాతం వరకూ తగ్గాయి.
అమెరికాలోనూ ఇదే తీరు
ప్రస్తుత స్టాక్ మార్కెట్ పతనం ఒక్క భారత్కే పరిమితం కాలేదు. ఇతర దేశాల స్టాక్ సూచీలన్నీ ఇదే తరహాలో పడిపోతున్నాయి. సోమవారం రాత్రి కడపటి సమాచారం అందేటప్పటికి అమెరికా డోజోన్స్ 1,000 పాయింట్లు, నాడాక్ 600 పాయిం ట్లు నష్ట పోయాయి. యూరప్లోని ప్రధాన మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇండెక్స్లు 3 శాతం, ఆసియాలో చైనా, హాంకాంగ్, కొరియా, సింగపూర్ సూచీలు 2-3 శాతం మధ్య క్రాష్ అయ్యాయి.
19.50 లక్షల కోట్లు ఆవిరి
ఇన్వెస్టర్లు రూ.19.50 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. ఈ సోమవారం ఒక్కరోజే రూ.9.14 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ జనవరి 18-24 మధ్యకాలంలో రూ.19,50,288 కోట్లు తగ్గి రూ.2,60,52,150 కోట్లకు పడిపోయింది. ఈ జనవరి 17న మార్కెట్ విలువ రూ.2,80,02,438 కోట్ల రికార్డుస్థాయికి చేరిన అనంతరం స్వల్పకాలంలోనే ఇన్వెస్టర్లు భారీ సంపదను కోల్పోవడం గమనార్హం.
న్యూటెక్ షేర్లు నిలువునా పతనం
అత్యంత కనిష్ఠ స్థాయిలకు జొమాటో, పేటీఎం
కొత్తగా లిస్టయిన న్యూటెక్ ఇంటర్నెట్ కంపెనీల షేర్లు సోమవారం నిలువునా పతనమయ్యాయి. జొమాటో, పేటీఎం, పాలసీబజార్, నైకా షేర్లను ఇన్వెస్టర్లు జోరుగా విక్రయించారు. జొమాటో తాజాగా 20 శాతం క్షీణించగా, నైకా 13 శాతం పతనమయ్యింది. పేటీఎం, పాలసీబజార్ (ఎఫ్బీ ఫిన్టెక్) 11 శాతం క్షీణించి, నూతన కనిష్ఠం రూ. 766 వద్ద నిలిచింది. పేటీఎం మాతృసంస్థ అయిన 97 కమ్యూనికేషన్స షేరు అయితే ఐపీవో ధర రూ.2,150తో పోలిస్తే ఇప్పటికే 60 శాతం తగ్గగా, లిస్టింగ్ ధర రూ.1,950లో ఇప్పుడు సగానికిపైగా తగ్గి రూ. 917 వద్ద ముగిసింది. రూ.130 సమీపంలో లిస్టయ్యి రూ. 160 గరిష్ఠస్థాయివరకూ పెరిగిన జొమాటో ఇప్పుడు రూ. 91 స్థాయికి తగ్గింది. ఫ్యాషన్ బ్రాండ్ నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ రూ.2,600 గరిష్ఠం రూ. 1,700 సమీపానికి క్రాష్ అయ్యింది.
మార్కెట్ అతలాకుతలంకుప్పకూలిన స్టాక్ సూచీలు
అమెరికా ఫెడ్ సమావేశం: అమెరికాలో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠస్థాయికి ఎగిసిన నేపథ్యంలో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ మంగళ, బుధవారాల్లో సమావేశం కానున్నది. కొవిడ్ సంక్షోభం కారణంగా 2,000 ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఉద్దీపన ప్యాకేజీని ఫెడ్ వేగంగా వెనక్కు తీసుకుని, త్వరితంగా వడ్డీ రేట్లను పెంచుతాయన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. ఫలితంగా అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లన్నీ కుదలేవుతున్నాయి.
రష్యా, ఉక్రయిన్ ఉద్రిక్తతలు: రష్యా, ఉక్రయిన్ దేశాల సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రికతలు మార్కెట్ పతనానికి ఆజ్యం పోశాయి. ఉక్రయిన్ సరిహద్దుల్లో రష్యా తన సైన్యాన్ని భారీగా మోహరించడంతో యుద్ధం జరుగుతుందన్న ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఉక్రయిన్ వదిలిరావాలంటూ ఆ దేశంలో నివసిస్తున్న తన పౌరులను అమెరికా హుటాహుటిన పిలిపించడం కూడా ప్రపంచ మార్కెట్ల క్షీణతకు ఒక కారణం.
బడ్జెట్ భయాలు: మరో వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సమర్పించనున్న బడ్జెట్ ప్రతిపాదనల పట్ల సైతం ఇన్వెస్టర్లకు తాజాగా భయాలు ఏర్పడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. కీలకమైన పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తారని, దీంతో ద్రవ్యలోటు గాడితప్పుతుందన్న అంచనాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి.
ఎఫ్పీఐల అమ్మకాలు : విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు)..సోమవారం రూ.3,700 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్టు ఎక్సేంజీల ప్రాధమిక గణంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి 18-24 మధ్యకాలంలో దేశీ మార్కెట్ నుంచి ఎఫ్పీఐలు రూ. 15,000 కోట్లు (2 బిలియన్ డాలర్లు) వెనక్కు తీసుకున్నారు.