ఆఖరు నిమిషంలో మహారాష్ట్రకు వేదాంత-ఫాక్స్కాన్ బైబై చెప్పేశాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే లక్ష ఉద్యోగావకాశాలు, లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడులు దూరమయ్యాయి. అధికారం దక్కించుకోవడం కోసం ఎంతదాకైనా వెళ్తామని మోదీ సర్కారు మరోమారు రుజువు చేయగా.. షిండే, ఫడ్నవీస్లు ఒక్కసారిగా ఇరుకునపడ్డారిప్పుడు. మహారాష్ట్రలో ఇది ప్రజా నిరసనకు దారితీస్తున్నదిమరి.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: చివరి నిమిషంలో మహారాష్ట్ర నుంచి గుజరాత్కు వేదాంత-ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ మారిపోవడం ఇప్పుడు అంతటా హాట్టాపిక్గా మారింది. రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన ఈ ప్రతిష్ఠాత్మక ప్లాంట్ ద్వారా లక్షకుపైగానే ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. అయితే త్వరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యానే బీజేపీ కుతంత్రంతో మహారాష్ట్రకు ఈ సెమీకండక్టర్ల ప్లాంట్ దూరమైందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారిప్పుడు. నిజానికీ పరిణామం బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లకు ఇబ్బందికరంగా ఉందని వారంటున్నారు. అక్కడ ప్రజా నిరసనకు ఈ వ్యవహారం దారితీస్తున్నదిమరి. సోమవారం గుజరాత్ ప్రభుత్వంతో ఆ రాష్ట్రంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం వేదాంత, ఫాక్స్కాన్ ఎంవోయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
వెన్నుపోటు రాజకీయం
మహారాష్ట్రలో శివసేన నాయకత్వంలోని ఉద్ధవ్థాక్రే సర్కారును చీల్చి బీజేపీతో జట్టు కట్టి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిన సంగతి విదితమే. ఇప్పుడు అక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. అయినప్పటికీ గుజరాత్ గెలుపు కోసం మహారాష్ట్రను బలిచేస్తూ సెమీకండక్టర్ల ప్లాంట్ను మోదీ సర్కారు తన్నుకుపోయిందన్న విమర్శలు ఇప్పుడు మరాఠీల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. నిజానికి గత మూడేండ్లుగా సెమీకండక్టర్ ప్లాంట్ కోసం ఫాక్స్కాన్తో మహారాష్ట్ర ప్రభుత్వం లాబీయింగ్ చేస్తున్నది. వేదాంతనూ పెట్టుబడులకు ఒప్పించింది. ముంబైలో ఓ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడులను పెడతామని మహా సర్కారుతో ఫాక్స్కాన్ ఒప్పం దం కుదుర్చుకున్నది. ఈ క్రమంలో బీజేపీ అధికార బలాన్ని ఉపయోగించి ప్లాంట్ను గుజరాత్కు తరలించిందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. దీనిపై నిజమైన ముఖ్యమంత్రి తప్పక స్పందిస్తారంటూ షిండే వైఖరిని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్థాక్రే ఎండగట్టారు.
తెలంగాణకూ ద్రోహం
ఇప్పుడు మహారాష్ట్రకు జరిగిన ద్రోహమే.. చాలాకాలం నుంచి తెలంగాణకూ జరుగుతున్నది. ఖాజీపేట్లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉన్నది. అయినప్పటికీ రూ.21,969 కోట్ల ఈ ఎలక్ట్రిక్ కోచ్ ఫ్యాక్టరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్కు ప్రకటించారు. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం భగ్గుమన్నారు. ‘ఇది డెమోక్రసీ కాదు.. మోడెమోక్రసీ. ఆఫ్ గుజరాత్, బై గుజరాత్, ఫర్ గుజరాత్, టు గుజరాత్ అంటూ ప్రజాస్వామ్యం అర్థాన్నే కేంద్రంలోని మోదీ సర్కారు మార్చేసింది’ అన్నారు. ఇక హైదరాబాద్లో వస్తుందని భావించిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్నూ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్నికల్ (గిఫ్ట్) సిటీకి కేటాయిస్తూ బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు చేసింది తెలిసిందే.