హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ముంబైకి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్(బీఎస్వీ) రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. మహిళల ఆరోగ్య ఉత్పత్తులు, రేబిస్ వ్యాక్సిన్, ఇమ్యునోగ్లోబులిన్స్, హార్మోన్స్ తదితరమైన వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. కంపెనీ ఎండీ, సీఈవో సంజీవ్ నవాంగుల్ మంగళవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. అనంతరం జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, జీవశాస్ర్తాలు, ఔషధాల విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సీరమ్స్ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ట్రం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్గానే కాకుండా దేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా పేరుగాంచిందని అన్నారు. బీఎస్వీ రాకతో రాష్ట్రంలో జీవశాస్ర్తాల రంగం మరింత బలోపేతం కాగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. బీఎస్వీ కంపెనీకి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మహిళల ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాల్లో కంపెనీతో భాగస్వామి అవుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 10 ప్రధాన బయోటెక్ కంపెనీల్లో బీఎస్వీ ఒకటి కావడం విశేషం. ఈ కంపెనీ గత 50 ఏండ్లుగా అనేక రకాల బయోలాజికల్, బయోటెక్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను అందిస్తున్నది. తాజాగా ఈ కంపెనీ మహిళల ఆరోగ్యం, క్రిటికల్ కేర్, ఐయూఐ-ఐవీఎఫ్ చికిత్సా రంగాల్లో ప్రవేశిస్తున్నది. ఈ సంస్థలో దేశవ్యాప్తంగా 1000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, దాని ఉత్పత్తులు 70 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.